Ticker

6/recent/ticker-posts

జగన్‌ను కలిసిన రాజధాని ప్రాంత రైతులు.. తమను వేధిస్తున్నారని ఆవేదన


ANDRAPRADESH, AMARAVATHI, JUN 02: వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిని రాజధాని ప్రాంతానికి చెందిన పలువురు రైతులు కలిశారు. ఉండవల్లి, పెనుమాక, నిడమర్రు, నేలపాడు తదితర గ్రామాలకు చెందిన రైతులు తమ సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ, భూములు ఇవ్వని రైతులను ప్రభుత్వం తీవ్రంగా ఇబ్బందులకు గురిచేస్తోందని ఆరోపించారు. భూ సేకరణ కోసం నోటిఫికేషన్లు జారీ చేస్తూ దౌర్జన్యాలకు పాల్పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. 


భూములు ఇవ్వని రైతుల పొలాల్లో అభివృద్ధి పనుల పేరుతో విధ్వంసం సృష్టిస్తున్నారని పేర్కొన్నారు. దేవాలయ భూములకు సంబంధించి కూడా ప్రభుత్వం వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటోందని రైతులు ఆరోపించారు. దేవాలయ భూముల్లో ప్లాట్లు ఇస్తామని చెబుతున్నారని, ఆ భూములను రక్షించాల్సిన అవసరం ఉందని తెలిపారు. దేవాలయ భూముల పరిరక్షణ విషయంలో తమకు అండగా నిలవాలని జగన్‌ను కోరారు. ప్రస్తుతం నిర్మిస్తున్న స్టీల్ బ్రిడ్జి పూర్తిగా కుంగిపోయిందని రైతులు పేర్కొన్నారు. 

ఈ ప్రాంత గ్రామాల్లో ల్యాండ్ పూలింగ్ అవసరం లేదని, కరకట్ట రహదారిని విస్తరించడం ద్వారా సమస్యకు పరిష్కారం లభిస్తుందని సూచించారు. దీనివల్ల ప్రభుత్వ ఖర్చు కూడా తగ్గుతుందని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని అభిప్రాయపడ్డారు. ఉండవల్లి ప్రాంతానికి సంబంధించి పర్యావరణ ప్రభావ అంచనా (ఎన్విరాన్‌మెంట్ ఇంపాక్ట్ అసెస్‌మెంట్), సామాజిక ప్రభావ అంచనా (సోషల్ ఇంపాక్ట్ అసెస్‌మెంట్) నిర్వహించకుండా భూములను బలవంతంగా స్వాధీనం చేసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. తాము ఎదుర్కొంటున్న సమస్యలపై గట్టిగా గళం వినిపించాలని, రైతుల హక్కుల పరిరక్షణ కోసం పోరాడాలని జగన్‌ను రైతులు కోరారు.