ANDRAPRADESH, AMARAVATHI, JUN 02: రాజధాని ప్రాంత రైతులతో సమావేశమైన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, రైతుల అభిప్రాయాలకు అనుగుణంగానే ముందుకు సాగుతామని హామీ ఇచ్చారు. రైతులను బలవంతపెట్టి నిర్ణయాలు అమలు చేయడం మంచిది కాదని ఆయన పేర్కొన్నారు. రైతులకు అవసరమైన సహాయ సహకారాలు అందించడంతో పాటు వారిని సంతోషపెట్టే విధంగా ప్రభుత్వ చర్యలు ఉండాలని, ఇబ్బందులకు గురిచేసే నిర్ణయాలు తీసుకోకూడదని అన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డిని రాజధాని ప్రాంతానికి చెందిన పలువురు రైతులు కలిశారు. ఉండవల్లి, పెనుమాక, నిడమర్రు, నేలపాడు తదితర గ్రామాలకు చెందిన రైతులు తమ సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు.
అయితే, రాజధాని నిర్మాణానికి ఇప్పటికే తీసుకున్న 50 వేల ఎకరాల భూముల పరిస్థితికే స్పష్టమైన దిశ లేదని జగన్ విమర్శించారు. అలాంటప్పుడు మరో 50 వేల ఎకరాలు అవసరమని ప్రభుత్వం చెప్పడం సమంజసం కాదన్నారు. అందుకే ప్రత్యామ్నాయంగా “మావిగన్” ప్రతిపాదనను సూచించినట్లు వెల్లడించారు. విజయవాడలో ఇప్పటికే అంతర్జాతీయ విమానాశ్రయం ఉండగా మరో ఎయిర్పోర్టు అవసరం ఏమిటని జగన్ ప్రశ్నించారు. ప్రస్తుతం విజయవాడ విమానాశ్రయంలో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని, అవి వచ్చే నెలల్లో పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. అలాగే మచిలీపట్నం పోర్టు తమ ప్రభుత్వ హయాంలోనే ప్రారంభించామని, నిధుల కొరత లేకుండా చర్యలు తీసుకున్నామని గుర్తుచేశారు.
రాష్ట్రంలో జాతీయ రహదారులు, రైల్వే స్టేషన్లు వంటి మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్నప్పటికీ వాటిని సద్వినియోగం చేసుకోవడంపై ప్రభుత్వం దృష్టి పెట్టడం లేదని జగన్ ఆరోపించారు. ప్రస్తుత విధానాల వల్ల భవిష్యత్తులో కూడా రాజధానికి స్పష్టమైన రూపం లేకుండా పోతుందని అన్నారు. రాజధాని ప్రాంతంలో కనీస మౌలిక సదుపాయాల కల్పనకే ఎకరాకు రూ.2 కోట్ల వరకు ఖర్చు అవుతుందని జగన్ పేర్కొన్నారు. రహదారులు, డ్రైనేజీ వ్యవస్థ, తాగునీరు, విద్యుత్ వంటి సదుపాయాల కోసం జీవితాంతం భారీ వ్యయం చేయాల్సి వస్తుందని చెప్పారు. ఈ మొత్తం ఖర్చు దాదాపు రూ.2 లక్షల కోట్లకు చేరుకునే అవకాశం ఉందని అంచనా వేశారు.
రాజధాని అభివృద్ధి పేరుతో భారీ అవినీతి జరుగుతోందని జగన్ ఆరోపించారు. ఎక్కడ చూసినా స్కాములే కనిపిస్తున్నాయని, రాజధాని పేరుతో వరుసగా అక్రమాలు జరుగుతున్నాయని విమర్శించారు. మావిగన్ను గ్రోత్ కారిడార్గా ప్రకటిస్తే వేగంగా అభివృద్ధి సాధ్యమవుతుందని జగన్ అభిప్రాయపడ్డారు. సుమారు 110 కిలోమీటర్ల పరిధిలో గ్రోత్ కారిడార్ అభివృద్ధికి నిధులు కేటాయిస్తే మొత్తం ప్రాంతం సమగ్రంగా అభివృద్ధి చెందుతుందని తెలిపారు వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి..

