సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. ‘గత ప్రభుత్వ హయాంలో భూ రికార్డులు తారుమారు కావడం వల్ల అనేక వివాదాలు తలెత్తాయి. ఒకప్పుడు బ్రిటిష్ కాలం నుంచి కొనసాగిన పటిష్టమైన భూ రికార్డుల వ్యవస్థ కారణంగా ఆంధ్రప్రదేశ్లో రెవెన్యూ సమస్యలు తక్కువగా ఉండేవి. కానీ గత పాలకుల నిర్వాకంతో భూ యాజమాన్య సమస్యలు పెరిగిపోయాయి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరిట తీసుకొచ్చిన చట్టం రైతుల భూములపై అనిశ్చితి సృష్టించింది. అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ చట్టాన్ని రద్దు చేసి రైతుల యాజమాన్య హక్కులను కాపాడాము. భూమి రికార్డులను మరింత భద్రంగా ఉంచేందుకు ప్రభుత్వం ఆధునిక సాంకేతికతను వినియోగిస్తోంది. బ్లాక్చైన్ టెక్నాలజీ, క్యూఆర్ కోడ్లు, అధునాతన భద్రతా ఫీచర్లతో కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలను జారీ చేస్తున్నాము. కరెన్సీ నోట్లకు ఉండే భద్రతా ప్రమాణాల తరహాలో రాజముద్రతో కూడిన పాస్ పుస్తకాలు రైతులకు అందిస్తున్నాము. రీ-సర్వే, ఈ-కేవైసీ ప్రక్రియల అనంతరం మాత్రమే పాస్ పుస్తకాలు ముద్రిస్తున్నాము’ అని వివరించారు.
‘రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 6,688 గ్రామాల్లో రీ-సర్వే పూర్తి చేసి 26.46 లక్షల మంది రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు జారీ చేసాము. ఇంకా 62.32 లక్షల పుస్తకాలు పంపిణీ చేయాల్సి ఉంది, నిర్ణీత గడువులోగా 90 లక్షల మంది భూ యజమానులకు పాస్ పుస్తకాలు అందజేయడమే లక్ష్యం. గత పాలనలో ఏర్పడిన సమస్యలను పరిష్కరించేందుకు మూడు సంవత్సరాల పాటు కృషి చేయాల్సి వచ్చింది. రెవెన్యూ శాఖలో సమూల మార్పులు తీసుకొస్తున్నాము. రీ-సర్వే 2.0 కింద ఇప్పటికే 1,836 గ్రామాల్లో తుది రికార్డ్ ఆఫ్ రైట్స్ పూర్తి చేసాం. అమ్మకం, బహుమతి, విభజన వంటి 9 లక్షల భూ లావాదేవీలకు 100 శాతం ఆటో మ్యుటేషన్ వ్యవస్థను అమలు చేస్తున్నాము. వారసత్వ హక్కుల బదిలీని సులభతరం చేస్తూ రూ.10 లక్షల లోపు ఆస్తులకు కేవలం రూ.100తో బదిలీ సౌకర్యం కల్పించాము. అంతకంటే ఎక్కువ విలువ గల ఆస్తులకు రూ.1,000 స్టాంప్ డ్యూటీ చెల్లిస్తే సరిపోతుంది’ అని సీఎం చెప్పారు.
అలాగే పాత భూ రికార్డుల డిజిటలైజేషన్ వేగంగా కొనసాగుతోందని.. 1బీ, అడంగల్, డీకేటీ, ఇనాం, సీలింగ్ రికార్డులను డిజిటల్ రూపంలోకి తీసుకువస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. వాట్సాప్ ద్వారా మ్యుటేషన్ దరఖాస్తు, ట్రాకింగ్ సౌకర్యం అందుబాటులోకి తీసుకువచ్చినట్లు పేర్కొన్నారు. 1.37 లక్షల ఎకరాల విలేజ్ సర్వీస్ ఇనాం భూములను 22ఏ జాబితా నుంచి తొలగించామని, 15 జిల్లాల్లోని 33,012 ఎకరాల షరతు గల పట్టా భూములపై ఆంక్షలను కూడా ఎత్తివేసినట్లు వెల్లడించారు. వ్యవసాయ రంగానికి ప్రభుత్వం పూర్తి స్థాయిలో అండగా నిలుస్తోందని సీఎం స్పష్టం చేశారు. అన్నదాత సుఖీభవ పథకం కింద మూడు విడతల్లో 46 లక్షల మంది రైతులకు రూ.8,985 కోట్లు జమ చేశామని, కేంద్ర ప్రభుత్వ సహాయంతో కలిపి ప్రతి రైతుకు సంవత్సరానికి రూ.20 వేల వరకు ఆర్థిక సహాయం అందిస్తున్నామని చెప్పారు. గత ప్రభుత్వంలో ధాన్యం అమ్మిన రైతులకు డబ్బులు రావడానికి నెలల తరబడి పట్టేదని, ప్రస్తుతం 24 గంటల్లోనే రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తున్నామని సీఎం పేర్కొన్నారు.
గోదావరి డెల్టా ప్రాంతంలో కాలువలు, చెరువుల మరమ్మతులు సమర్థవంతంగా నిర్వహిస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు, ఆక్వా రంగ అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు. ఆక్వా చెరువులకు యూనిట్కు రూ.1.50కే విద్యుత్ అందిస్తున్నామని, దాణా ధరలు పెరగడంతో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను కేంద్రం దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. సోయాబీన్ మీల్ దిగుమతులపై సుంకాలు తగ్గించాలని కేంద్రాన్ని కోరినట్లు వెల్లడించారు. ఆక్వా రంగం రాష్ట్ర, దేశ ఆర్థిక వ్యవస్థలకు కీలకమని పేర్కొన్న సీఎం, ఆ రంగానికి అన్ని విధాలా మద్దతు కొనసాగుతుందని హామీ ఇచ్చారు. ఆక్వా పరిశ్రమ నుంచి వచ్చే వ్యర్థాలను వినియోగించి న్యూట్రాస్యూటికల్ ఔషధాల తయారీకి అవకాశాలు ఉన్నాయని కూడా సూచించారు. సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన లక్ష్యాలతో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని, రైతుల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.

