Ticker

6/recent/ticker-posts

లోక్‌సభలో 2/3 మెజారిటీనే టార్గెట్.. డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం బీజేపీ వ్యూహం..


INDIA NEWS, JUN 09: తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) సంక్షోభం, బీజేపీకి వరంగా మారుతోంది. తన లక్ష్యాలను సాధించుకోవడానికి ఎన్డీయే సర్కార్ వేగంగా పావులు కదుపుతోంది. ముఖ్యంగా, బీజేపీ సర్కార్ కీలకంగా భావిస్తున్న నియోజకవర్గాల పునర్విభజన(డీలిమిటేషన్)ను ఆమోదింపచేసుకుని, 2029 ఎన్నికలలోపే మహిళా రిజర్వేషన్ బిల్లును అమలు చేయాలని భావిస్తోంది. ఈ బిల్లుల ఆమోదానికి పార్లమెంట్‌లో 2/3 వంతు మెజారిటీ అవసరం. ప్రస్తుతం, ఉన్న ఎన్డీయే బలం దీనికి సరిపోదు. అయితే, ఇప్పుడు టీఎంసీ పరిణామాలు ఎంతో కొంత బీజేపీకి సహకరించే అవకాశం ఉంది.


టీఎంసీ సంక్షోభం కలిసి వస్తుందా??
టీఎంసీకి చెందిన 20 మంది లోక్‌సభ ఎంపీలు ఎన్డీయేకు మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. ఇది మమతా బెనర్జీకి భారీ ఎదురుదెబ్బగా చెప్పవచ్చు. సోమవారం మమతా ఇండియా కూటమి సమావేశంలో ఉన్న సమయంలోనే, తిరుగుబాటు ఎంపీలు బీజేపీ నేతలు, బెంగాల్ సీఎం సువేందు అధికారితో భేటీ అయ్యారు. కకోలి ఘోష్ దస్తిదార్ నేతృత్వంలో టీఎంసీ ఎంపీలు ఇప్పటికే ఓం బిర్లాకు లేఖ రాశారు. ఈ 20 మంది ఎంపీల మద్దతు లభిస్తే, లోక్‌సభలో ఎన్డీయే బలం 300 మార్కును దాటే అవకాశం ఉంది.

డీఎంకే మద్దతు కోసం ప్రయత్నాలు.
మరోవైపు, డీఎంకే మద్దతు కోసం బీజేపీ తెరవెనక ప్రయత్నాలు చేస్తోంది. డీఎంకేకు లోక్‌సభలో 22 మంది ఎంపీలు ఉన్నారు. అంశాల వారీగా మద్దతు ఇస్తే ఎన్డీయే సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే, కాంగ్రెస్ విజయ్ టీవీకే పార్టీకి మద్దతు ఇవ్వడంతో డీఎంకే-కాంగ్రెస్ మధ్య బంధం విడిపోయింది.

2/3 మెజారిటీ సాధించాలంటే..
ప్రస్తుతం లోక్‌సభలో 543 స్థానాలు ఉంటే, మూడు ఖాళీలు ఉన్నాయి. దీంతో సభ్యుల సంఖ్య 540కి చేరింది. ఎన్డీయే బలం 293, టీఎంసీ తిరుగుబాటు ఎంపీలు 20 మంది కలిస్తే 313కు చేరుతుంది. డీఎంకే మద్దతు సంపాదిస్తే 335కు చేరుతుంది. శివసేన ఉద్ధవ్ వర్గానికి 9 మంది ఎంపీలు ఉన్నారు. వీరు చీలిపోతే ఆరుగురు ఎంపీలు ఎన్డీయే వైపు వస్తారు. దీంతో సంఖ్య 341కి చేరుతుంది.

మూడింట రెండొంతులు(2/3) మెజారిటీ మార్క్ 362. మరో 12 సీట్ల దూరంలో ఎన్డీయే నిలిచిపోతుంది. చిన్న పార్టీలు, క్రాస్ ఓటింగ్ సాధ్యమైతే ఎన్డీయే మెజారిటీ సాధిస్తుంది. రాజ్యాంగ సవరణ బిల్లును ఆమోదించడానికి వీలవుతుంది.

మరోవైపు రాజ్యసభలో ఎన్డీయే మూడింట రెండొంతుల మెజారిటీకి చేరువైంది. తృణమూల్ కు చెందిన 13 రాజ్యసభ ఎంపీలు ఉన్నారు. ఇందులో చాలా మంది బీజేపీ వైపు వచ్చే ఛాన్స్ ఉంది. రాజ్యసభలో ఇప్పటికే ఎన్డీయేకు 150 సీట్లు ఉన్నాయి. డీఎంకే షరతులతో కూడిన మద్దతు ఇచ్చే ఛాన్స్ ఉంది. మూడింట రెండొంతుల మెజారిటీ మార్క్ 164 కాగా, ఈ సంఖ్యను ఈజీగానే ఎన్డీయే సాధించే అవకాశం ఉంది.

డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ కోసం వ్యూహాలు:
2011 జనాభా లెక్కల ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన కోసం రాజ్యాంగ సవరణ బిల్లు అవసరం అవుతుంది. 2026లో తొలి ప్రయత్నంగా డీలిమిటేషన్ బిల్లును ఎన్డీయే పార్లమెంట్‌లో ప్రవేశపెట్టింది. మూడింట రెండొంతుల మెజారిటీ లేకపోవడంతో ఈ బిల్లు ఓడిపోయింది. ఈసారి వర్షాకాల సమావేశాల్లో బీజేపీ ఈ బిల్లును మళ్లీ తీసుకురావాలని భావిస్తోంది. దీని కోసం వేగంగా పావులు కదుపుతోంది. మహిళలకు 33 శాతం రిజర్వేషన్, డీలిమిటేషన్ ప్రక్రియ, వన్ నేషన్-వన్ ఎలక్షన్ వంటి వాటికి ఆమోదం సాధించే లక్ష్యంగా ఎన్డీయే ప్రయత్నాలు మొదలుపెట్టింది.