Ticker

6/recent/ticker-posts

ఇరిగేషన్ పనుల్లో జాప్యం చేయొద్దు: మంత్రి నిమ్మల రామానాయుడు


ఇరిగేషన్ పనుల్లో అధికారులు జాప్యం చేయొద్దని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. సాగు నీటి సంఘాలు ఆధ్వ‌ర్యంలో, వారి ప‌రిధిలోని ప‌నుల‌ను, మే నెలాఖ‌రుకు పూర్తిచేయాలని మంత్రి నిమ్మల రామానాయుడు ఆదేశించారు.


విజయవాడ: ఇరిగేష‌న్ ప‌నులు, నిర్వహణ, మ‌ర‌మ్మ‌త్తుల కోసం రూ. 344 కోట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు విడుదల చేశారని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. BY: SR TV NEWS అవ‌స‌ర‌మైన చోట్ల 7 రోజుల వ్య‌వ‌ధితో షార్ట్ టెండ‌ర్లను పిల‌వ‌డానికి ప్ర‌భుత్వం అనుమ‌తిచ్చిందని అన్నారు. ఓ అండ్ ఎం పనులపై ఇరిగేషన్ అధికారులతో, మంత్రి నిమ్మల రామానాయుడు టెలీకాన్ఫ‌రెన్స్ నిర్వహించారు. ఈ సమావేశానికి స్పెషల్ చీఫ్ సెక్రటరీ సాయి ప్రసాద్, క‌డా క‌మిష‌న‌ర్ రాంసుంద‌ర్ రెడ్డి, ఈఎన్సీ వెంకటేశ్వరావు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సీఈలు, ఎస్ఈలు, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడారు. సాగునీటి ప్రాజెక్ట్‌ల నిర్వ‌హ‌ణ, మ‌ర‌మ్మ‌తు ప‌నుల‌ను చేప‌ట్టడమే తమ ప్రభుత్వ ప్ర‌ధాన ల‌క్ష్యమని అన్నారు. 2025 ఖ‌రీఫ్ ప్రారంభానికి ముందు నీటిపారుద‌ల వ్య‌వ‌స్థల‌ను సాధార‌ణ స్దితికి తీసుకురావాలని ఆదేశించారు. గేట్లు, ష‌ట్ట‌ర్లు, వంటి మెకానిక‌ల్ ప‌నుల‌ను త‌ప్ప‌నిస‌రిగా అసిస్టెంట్ ఇంజ‌నీర్ ప‌రిశీలించి, స‌క్ర‌మంగా ప‌నిచేసే స్దితిలో ఉన్నాయ‌నే ధ్రువీక‌ర‌ణ ప‌త్రాన్ని, చీఫ్ ఇంజ‌నీర్‌కు ఇవ్వాలని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు.

సాగు నీటి సంఘాలు ఆధ్వ‌ర్యంలో, వారి ప‌రిధిలోని ప‌నుల‌ను, మే నెలాఖ‌రుకు పూర్తిచేయాలని మంత్రి నిమ్మల రామానాయుడు ఆదేశించారు. ప‌నుల‌ను స‌కాలంలో పూర్తిచేయ‌డానికి చీఫ్ ఇంజ‌నీర్లు, సూప‌రింటెండెంట్ ఇంజ‌నీర్లు నిరంత‌రంగా ప‌ర్య‌వేక్ష‌ణ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఎట్టి ప‌రిస్దితుల్లోనూ అన్ని ప‌నులూ, సీజ‌న్ మొద‌లయ్యే నాటికి పూర్తి చేయాలని అధికారుల‌కు ఆదేశించారు. గతంలో మాదిరిగా కాకుండా మే చివరి నాటికి, అన్ని అత్యవసర పనులు, నాణ్యతతో పూర్తి చేయాలని మంత్రి నిమ్మల రామానాయుడు నిర్దేశించారు.