మాజీ మంత్రి, వైసీపీ నేత కొడాలి నానిపై ఆయన ముఖ్య అనుచరుడు మహమ్మద్ ఖాసీం అలియాస్ అబూ నిప్పులు చెరిగారు. కొడాలి నాని ఎక్కడ ఉన్నారో తమకు తెలియదన్నారు.
గుడివాడ: మాజీ మంత్రి, వైసీపీ నేత కొడాలి నానిని నమ్మి తాము మోసపోయామని BY: SR TV NEWS ఆ పార్టీ కీలక నేత, కృష్ణా జిల్లా వైసీపీ మైనార్టీ సెల్ అధ్యక్షుడు మహమ్మద్ ఖాసిం అలియాస్ అబూ ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం వరద బాధితులను సైతం ఆయన పట్టించుకోలేదని విమర్శించారు. ఈ నేపథ్యంలో రాజకీయ సన్యాసం చేస్తున్నట్లు అబూ ప్రకటించారు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల అనంతరం పార్టీ శ్రేణులను గాలికి వదిలేశారంటూ కొడాలి నానిపై ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. వైసీపీలో ఉన్న తమ కష్టాలను పట్టించుకున వారే లేరన్నారు. వరదల కారణంగా నందివాడ మండలం మునిగిపోయి.. ప్రజలు కష్టపడుతున్నా కొడాలి నాని అటువైపు కన్నెత్తి చూడలేదని మండిపడ్డారు. కానీ, టీడీపీ నాయకుడు, స్థానిక ఎమ్మెల్యే వెనిగండ్ల రాముతోపాటు ఆయన అనుచరులు.. వరద బాధితులకు అండగా నిలిచారని గుర్తు చేశారు. రాజకీయాలకే కొత్త అర్థం చెప్పేలా.. ఎమ్మెల్యే రాము నిత్యం ప్రజల మధ్య ఉంటూ సేవ చేస్తున్నారని పేర్కొన్నారు.
అసెంబ్లీ ఎన్నికల అనంతరం వెనిగండ్ల రాము.. అమెరికా పారిపోతాడంటే తామంతా నమ్మామని తెలిపారు. మమ్మల్ని తప్పుదోవ పట్టించిన కొడాలి నాని ఎక్కడ ఉన్నాడో కూడా తమకు తెలియడం లేదన్నారు. ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే రాముపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు తాను క్షమాపణ చెబుతున్నట్లు అబూ ప్రకటించారు.
ఇకపై రాజకీయాలకు తాను దూరంగా ఉంటానని స్పష్టం చేశారు. అయితే ఈ వీడియోలో అబూ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. కొడాలి నానిపై అబూ చేసిన వ్యాఖ్యలు ఉమ్మడి కృష్ణాజిల్లాలో ఆ పార్టీలోని అనైక్యతను సూచిస్తుందనే వాదన బలంగా వినిపిస్తోంది.
Social Plugin