ANDRAPRADESH: ఏపీ ప్రభుత్వం మరో వైసీపీ నేతను టార్గెట్ చేసింది. వైసీపీ టాప్ లీడర్లలో ఒకరైన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై అటవీశాఖ కేసు ఫైల్ చేసింది By: SR TV NEWS ఏపీ ప్రభుత్వం మరో వైసీపీ నేతను టార్గెట్ చేసింది. వైసీపీ టాప్ లీడర్లలో ఒకరైన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై అటవీశాఖ కేసు ఫైల్ చేసింది. 11 నెలలుగా పలువురు వైసీపీ నేతలపై పోలీసు కేసులు నమోదు చేసి అరెస్టులు చేయిస్తున్న కూటమి ప్రభుత్వం మాజీ మంత్రి పెద్దిరెడ్డి చుట్టూ ఉచ్చు బిగించేలా అనేక ప్రయత్నాలు చేసింది. అధికారంలోకి వచ్చిన నుంచి ఆయనను ఏ కేసుల్లో ఇరికిద్దామనే ప్రయత్నాలు చేసినట్లు వైసీపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. ఈ క్రమంలోనే పెద్దిరెడ్డిపై అటవీ భూముల ఆక్రమణ నేరం కింద అటవీశాఖ చార్జెస్ నమోదు చేసింది.
ప్రస్తుతం పుంగునూరు ఎమ్మెల్యేగా ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితోపాటు ఆయన కుటుంబ సభ్యులపై ఈ నెల 6న అటవీశాఖ అధికారులుకేసు నమోదు చేశారు. చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలం మంగళంపేట అటవీ ప్రాంతంలోకి అక్రమంగా ప్రవేశించి స్థలాన్ని కబ్జా చేయడంతోపాటు జీవ వైవిధ్యానికి నష్టం కలిగించారని పెద్దిరెడ్డిపై అభియోగాలు మోపారు. అటవీశాఖ నమోదు చేసిన ఈ కేసులో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన కుమారుడు, రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డి తమ్ముడు తంబళ్లపల్లె ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకానాథరెడ్డి, ఈయన భార్య ఇందిరమ్మను నిందితులుగా చేర్చారు. అటవీ భూములను ఆక్రమించుకున్నారని పెద్దిరెడ్డిపై వచ్చిన ఆరోపణలతో ప్రభుత్వం ముగ్గురు అధికారులతో కమిటీ వేసింది.
ఈ కమిటీలో కలెక్టర్ సుమిత్ కుమార్, ఎస్పీ మణికంఠ, ఫారెస్ట్ కన్జర్వేటర్ యశోదాబాయి ఉన్నారు. ఈ ముగ్గురు అధికారుల విచారణలో పెద్దిరెడ్డి కుటుంబ సభ్యులు27.98 ఎకరాల అటవీ భూమిని కబ్జా చేశారని వెల్లడైనట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఏ అనుమతులు లేకుండా బోరు తవ్వడంతోపాటు నిర్మాణాలు చేపట్టారని జీవ వైవిధ్యానికి భంగం కలిగించారని అధికారుల కమిటీ నివేదిక సమర్పించింది. సుమారు కోటి రూపాయల నష్టం వాటిల్లినట్లు ఆ నివేదికలో పేర్కొంది.
పెద్దిరెడ్డి ఆక్రమిత స్థలంలో ప్రస్తుతం అటవీ అధికారులు సర్వే హద్దు రాళ్లు పాతుతున్నారు. మరో వారంలో ఇది పూర్తి కానుంది. ఈ వ్యవహారంలో పెద్దిరెడ్డితోపాటు మిగతా నిందితులపై త్వరలో పాకాల కోర్టులో చార్జిషీటు దాఖలు చేయనున్నట్లు అటవీ అధికారులు చెబుతున్నారు. ఇదే సమయంలో అటవీ భూముల ఆక్రమణలపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదేశించడంతో అధికారులు ఆ దిశగా సమాలోచనలు జరుపుతున్నట్లు చెబుతున్నారు. మరోవైపు పెద్దిరెడ్డికి సహకరించిన అధికారులపైనా ప్రభుత్వం ఆరా తీస్తోందని అంటున్నారు. ఇప్పటికే కొందరిని గుర్తించారని వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోనున్నట్లు ప్రచారం జరుగుతోంది.
Social Plugin