ANDRAPRADESH, ELURU, JUN 06: ఏలూరు జిల్లా రాష్ట్ర స్థాయిలో అవార్డు పొందేలా యోగాంధ్ర- 2026 కార్యక్రమాన్ని నిర్వహించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ డా. ఎం.జె. అభిషేక్ గౌడ అధికారులను ఆదేశించారు. ఈనెల 7వ తేదీ నుండి ప్రారంభం కానున్న యోగాంధ్ర కార్యక్రమం నిర్వహణ సంసిద్దతపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. సంబంధిత శాఖల అధికారులతో శనివారం సాయంత్రం జేసీ టెలి కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.
ఈ సందర్భంగా జేసీ అభిషేక్ గౌడ మాట్లాడుతూ యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా మాస్టర్ ట్రైనర్లు, ట్రైనర్ల నమోదు కార్యక్రమాన్ని వెంటనే పూర్తిచేసి, 7వ తేదీ నుండి ప్రజలకు శిక్షణ అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. యోగాంధ్ర కార్యక్రమాన్ని ఈనెల 7వ తేదీన జిల్లాలోని గ్రామ, మండల, జిల్లా స్థాయిలో ప్రారంభ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. యోగాంధ్ర -2026 థీమ్ పై రూపొందించిన బ్యానర్ ను కార్యక్రమంలో నిర్వహణలో తప్పక ప్రదర్శించాలన్నారు.
కార్యక్రమం అనంతరం ఫోటోలు, వీడియోలు యోగాంధ్ర పోర్టల్ లో అప్లోడ్ చేయాలన్నారు. వేసవి దృష్ట్యా ఎండ వేడిమి లేకుండా ఉదయమే యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించాలన్నారు. యోగ ఆవశ్యకత, ఆరోగ్య ప్రయోజనాలపై జూనియర్స్ కేటగిరిలో విద్యార్థులకు ఈనెల 7,8,9 తేదీలలో గ్రామ స్థాయిలో వివిధ విభాగాలలో పోటీల నిర్వహించాలని, పోటీలలో పాల్గొనే వారు తప్పనిసరిగా ఆన్లైన్ లో నమోదు కావాలన్నారు.
జిల్లాలో 191 మంది మాస్టర్ ట్రైనర్లు నమోదు అయ్యారని, వారితో మండల, గ్రామ స్థాయిలో ట్రైనర్లకు శిక్షణ అందించాలన్నారు. యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొనేందుకు ఉత్సాహం ఉన్న ప్రతీ ఒక్కరినీ యోగాంధ్ర యాప్ లో నమోదు చేయించాలన్నారు.
జిల్లా ఇంచార్జ్ డిఆర్ఓ జిల్లా పరిషత్ సీఈఓ జగదాంబ, నూజివీడు సబ్ కలెక్టర్ బి.వినూత్న, ఆర్డీఓ లు లక్ష్మీప్రసన్న, రమణ, వివిధ శాఖల జిల్లా అధికారులు, ఎంపిడిఓ లు, తహసీల్దార్లు పాల్గొన్నారు.

