KARNATAKA MAY 24: కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లాలో అత్యంత విషాదకరమైన ఘటన చోటుచేసుకుంది. ముత్యపుచిప్పల సేకరణ కోసం వెళ్లిన ఆ కుటుంబానికి తీరని శోకాన్ని మిగిల్చింది. నదిలో ముత్యపుచిప్పలు సేకరించడానికి వెళ్లిన ఒకే గ్రామానికి చెందిన ఎనిమిది మంది నీటి ప్రవాహంలో కొట్టుకుపోయి ప్రాణాలు కోల్పోయారు. మృతులలో ఏడుగురు మహిళలు కావడం గమనార్హం. ఈ ఘటనలో మరో ఇద్దరు గల్లంతవగా.. ఇద్దరిని స్థానికులు సురక్షితంగా రక్షించారు.
అకస్మాత్తుగా పెరిగిన ప్రవాహం.. కాపాడబోయి అందరూ
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తర కన్నడ జిల్లా షిరాలి గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు నదిలోకి దిగి ముత్యపుచిప్పలను సేకరిస్తున్నారు. అయితే ఆ సమయంలో ఎగువన కురుస్తున్న వర్షాల కారణంగా నది ప్రవాహం, నీటిమట్టం అకస్మాత్తుగా పెరిగాయి. నీటి లోతును సరిగ్గా అంచనా వేయలేకపోవడంతో మొదట ఒకరిద్దరు బలమైన ప్రవాహంలో కొట్టుకుపోయారు. అయితే నీటిలో మునిగిపోతున్న వారిని రక్షించే క్రమంలో.. మిగిలిన వారు కూడా ఒకరి వెనుక ఒకరు నదిలోకి దూకారు. ప్రవాహ ఉధృతి ఊహించని స్థాయిలో ఉండటంతో రక్షించడానికి వెళ్లిన వారు సైతం నీటి సుడిగుండంలో చిక్కుకుని ఒక్కొక్కరుగా జలసమాధి అయ్యారు. ఇప్పటి వరకు పోలీసులు నది నుంచి ఎనిమిది మంది మృతదేహాలను వెలికితీశారు.
ఉమేష్ మంజునాథ్ నాయక్ (40) – (మరణించిన వారిలో ఉన్న ఏకైక పురుషుడు)
లక్ష్మీ మహాదేవ్ నాయక్ (42)
లక్ష్మి జుట్టప్ప నాయక్ (30)
లక్ష్మీ అప్పన్న నాయక్ (60)
లక్ష్మి శివరామ్ నాయక్ (49)
జ్యోతి మస్తమ్మ నాయక్ (34)
మాల్తి నాయక్ (38)
మాస్టమ్మ నాయక్ (60)
ఇద్దరు సురక్షితం.. ఇంకా ఇద్దరి కోసం గాలింపు
ఈ ప్రమాదం నుంచి నాగరాత్న, మహాదేవి అనే ఇద్దరు మహిళలను స్థానికులు రక్షించారు. ప్రస్తుతం వీరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా ఇంకా ఇద్దరి ఆచూకీ లభించకపోవడంతో పోలీసులు, విపత్తు సహాయక బృందాలు (SDRF), స్థానిక మత్స్యకారులు గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. మృతులలో చాలామందికి ఇది వరకు నదిలోకి వెళ్లి ముత్యపుచిప్పలు సేకరించిన అనుభవం ఉందని పోలీసులు తెలిపారు. అయితే ఈసారి వర్షం కారణంగా నీటిమట్టం క్షణాల్లో పెరిగిపోవడాన్ని వారు ఊహించలేకపోయారని, అందువల్లే ఈ దారుణం జరిగిందని పేర్కొన్నారు.
పరిహారం ప్రకటించిన సీఎం
ఈ దారుణ ఘటనపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఇది అత్యంత బాధాకరమైన విషయమని పేర్కొంటూ మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం తరఫున ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. డిప్యూటీ సీఎం డి.కె.శివకుమార్, ప్రతిపక్ష నాయకుడు ఆర్.అశోక కూడా ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ నదీ ప్రమాదంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా తీవ్ర విచారం వ్యక్తం చేసినట్లు పీఎంఓ (PMO) ఒక ప్రకటనలో తెలిపింది. మృతుల కుటుంబాలకు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి (PMNRF) నుంచి రూ.2 లక్షల చొప్పున, అలాగే గాయపడిన వారికి రూ.50,000 చొప్పున ఎక్స్-గ్రేషియాను అందిస్తామని ప్రధాని మోడీ ప్రకటించారు.

