ఆంధ్రప్రదేశ్: రాష్ట్రంలో ఇంటర్మీడియట్ విద్యార్థుల సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఫిబ్రవరి, మార్చి నెలల్లో నిర్వహించిన ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల ఫలితాలను ఏప్రిల్ 15న విడుదల చేయనుంది. ఈ విషయాన్ని మంత్రి నారా లోకేష్ అధికారికంగా సోషల్ మీడియాలో ప్రకటించారు ఉదయం సరిగ్గా 10.31 నిమిషాలకు తాడేపల్లిలోని బోర్డు కార్యాలయంలో ఫలితాలు విడుదల చేయనున్నారు.
మంత్రి నారా లోకేష్ ఎక్స్ వేదికా కీలక సమాచారం షేర్ చేశారు. ఇంటర్ విద్యార్థుల నిరీక్షణ బుధవారంతో ముగుస్తుంది. విద్యార్థులందరికీ ఆల్ది బెస్ట్ అంటూ ఆయన సందేశాన్ని పోస్టు చేశారు.
ఈ ఏడాది ఇంటర్ పరీక్షలకు హాజరైన విద్యార్థుల సంఖ్య గత కొన్ని ఏళ్లతో పోలిస్తే గణనీయంగా ఉంది. మొత్తం 10, 57, 899 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో మొదటి ఏడాదికి చెందిన విద్యార్థులు 5, 31, 275 మంది విద్యార్థులు ఉండగా రెండో సంవత్సరానికి చెందిన వారు 5, 6, 264 మంది విద్యార్థులు ఉన్నారు. ఈ గణాంకాల్లో జనరల్ స్ట్రీమ్, ఒకేషనల్ కోర్సుల విద్యార్థులు ఇద్దరూ ఉన్నారు. ఈ ఏడాది పరీక్షల సమయంలో రాష్ట్రవ్యాప్తంగా 96 శాతం నుంచి 98 శాతం వరకు నమోదు అయ్యారు.
రిజల్ట్స్ను ఎలా చూసుకోవాలో స్టెప్ బై స్టెప్ తెలుసుకోండి!
ఫలితాలు విడుదలైన వెంటనే వెబ్సైట్లపై ఒత్తిడి పెరిగి అవి మొరాయించే అవకాశం ఉంటుంది. దీనిని దృష్టిలో ఉంచుకొని విద్యార్థుల కోసం రెండు ప్రధాన మార్గాల్లో బోర్డు సూచించింది.
ముందుగా అధికారిక వెబ్సైట్ resultsbie.ap.gov.in విజిట్ చేయండి. హాల్టికెట్ నంబర్, పుట్టిన తేదీ వివరాలను నమోదు చేయండి. మీ సబ్జెక్టుల వారిగా మార్కులు, గ్రేడ్లు స్క్రీన్పై కనిపిస్తాయి. భవిష్యత్ అవసరాల కోసం మార్క్స్ మెమోను డౌన్లోడు చేసుకోండి.
వాట్సాప్ ద్వారా మార్కులు ఇలా తెలుసుకోండి!
మన మిత్ర అనే వాట్సాప్ సేవ ఉపయోగించి కూడా ఇంటర్ ఫలితాలు తెలుసుకోవచ్చు. మీ మార్క్షీట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీని కోసం ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి.
మీ ఫోన్లో 9552300009 నెంబర్ను సేవ్ చేసి పెట్టుకోండి.
వాట్సాప్లో హాయ్ అనే మెసేజ్ను టైప్ చేసి పంపించండి.
వెంటనే వచ్చే సూచనల ప్రకారం మీ హాల్టికెట్ నెంబర్ ఎంటర్ చేస్తే సెకన్లలో ఫలితాలు మీ ఫోన్ స్క్రీన్పై కనిపిస్తాయి.
రికౌంటింగ్ కోసం అవకాశం
ఫలితాలు వచ్చిన తర్వాత కొందరు విద్యార్థులు ఆశించిన మార్కులు రాకపోవచ్చు. అటువంటి వారు నిరాశ చెందాల్సిన పని లేదు. ప్రభుత్వం వారికి కింది అవకాశాలను కల్పిస్తోంది. తమ మార్కులపై నమ్మకం ఉన్న విద్యార్థులు రీకౌంటింగ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. దీనిపై సబ్జెక్ట్కు కొంత రుసుం చెల్లించాల్సి ఉంటుంది. దరఖాస్తు ప్రక్రియ వారం రోజుల్లోనే మొదలు కానుంది. మార్కులు పెంచుకోవాలనుకునే వారికి, లేదా ఉత్తీర్ణత సాధించని వారికి సప్లిమెంటరీ, ఇంప్రూవ్మెంట్ పరీక్షల ఆప్షన్లు కూడా అందుబాటులో ఉన్నాయి.
వాట్సాప్లో డౌన్లోడ్ చేసిన మార్క్మెమో సరిపోతుందా?
ఇంటర్నెట్, వాట్సాప్లో డౌన్లోడ్ చేసిన మార్క్ మెమో కేవలం ప్రాథమిక సమాచారం మాత్రమే. ఇది అసలు సర్టిఫికెట్ కాదు. విద్యార్థులు తమ ఒరిజినల్ మార్క్స్ మెమో, ఇతర సర్టిఫికెట్ల కోసం మీ కాలేజీలకు వెళ్లాల్సి ఉంటుంది.

