Ticker

6/recent/ticker-posts

తెలంగాణ మా అయ్యా జాగిరే.. పవన్ కళ్యాణ్ పెయిడ్ ఆర్టిస్ట్


TELANGANA, HYDERABAD JUN 02: తాము ఏ అహంకారానికి వ్యతిరేకంగానైతే ఉద్యమ కాలంలో పోరాడామో, ఇప్పుడు అదే అహంకారపూరితమైన భాషను కొందరు మాట్లాడుతున్నారని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్రంగా మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఉద్యమకారుడు గద్దర్ గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడిన తీరును దళిత సంఘాలు తీవ్రంగా ఆలోచించాలని ఆయన ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.


తెలంగాణ మా అయ్యా జాగిరే అంటూ పవన్ కు కౌంటర్ ఇచ్చిన మంత్రి పొన్నం.. తెలంగాణ అమరవీరుల త్యాగాల గురించి గానీ, వారి కుటుంబాల సంక్షేమం గురించి గానీ పవన్ కళ్యాణ్ ఎప్పుడైనా మాట్లాడారా అని ప్రశ్నించారు. జగిత్యాల జిల్లాలోని కొండగట్టు అంజన్న ఆలయ అభివృద్ధికి గతంలో ప్రకటించిన నిధులపై మాట్లాడిన పవన్, ఆ నిధులేమైనా ‘మీ అయ్యా జాగీరా’ అంటూ ఘాటుగా స్పందించారు. పవన్ కళ్యాణ్ ఒక పెయిడ్ ఆర్టిస్ట్ లాగా వ్యవహరిస్తున్నారని ఆరోపించిన మంత్రి, ఆయనకు అందుతున్న పొలిటికల్ స్క్రిప్ట్‌లు బీఆర్ఎస్ కార్యాలయం నుండి వస్తున్నాయో లేక బీజేపీ ఆఫీస్ నుండి వస్తున్నాయో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఒక కీలక నేతగా పవన్ కళ్యాణ్‌కు తెలంగాణలో కేవలం ఒక గెస్ట్ (అతిథి) గా మాత్రమే ప్రోటోకాల్ గౌరవాన్ని కల్పించామని మంత్రి గుర్తు చేశారు. అలాంటప్పుడు తెలంగాణ నవనిర్మాణం పేరుతో ఇక్కడికి వచ్చి ఆయన పీకేదేంటని నిలదీశారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం లాంటి పవిత్రమైన రోజున కావాలనే ఇక్కడికి వచ్చి గెలికే ప్రయత్నం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రాంతంలో ఆంధ్ర ప్రాంతం వారు తిరగకూడదని తాము ఎక్కడా అనడం లేదని, ఇక్కడ ఆంధ్రా వాళ్లకు ఏం పని ఉందని కూడా తాము ప్రశ్నించడం లేదని, కానీ తెలంగాణ అస్తిత్వాన్ని అవమానిస్తే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. ప్రముఖ ప్రజాగాయకుడు గద్దర్ విషయంలో పవన్ కళ్యాణ్ మాట్లాడిన అనుచిత వ్యాఖ్యలపై ఆయన తక్షణమే బేషరతుగా క్షమాపణ చెప్పాలని మంత్రి పొన్నం ప్రభాకర్ గట్టిగా డిమాండ్ చేశారు.