Ticker

6/recent/ticker-posts

హెల్మెట్ లేకపోతే జరిమానా కాదు – ప్రాణ రక్షణే ముఖ్యం


చేబ్రోలు పోలీసుల వినూత్న స్పెషల్ డ్రైవ్

చేబ్రోలు, మార్చి 1: రహదారి ప్రమాదాలను తగ్గించేందుకు జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్, ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు చేబ్రోలు పోలీసులు వినూత్న కార్యక్రమాన్ని నిర్వహించారు. నిడమర్రు సీఐ రజినీ కుమార్ పర్యవేక్షణలో చేబ్రోలు ఎస్‌ఐ సూర్యభగవాన్ మరియు పోలీసు సిబ్బంది ఉంగుటూరు టోల్‌ప్లాజా వద్ద భారీ స్పెషల్ డ్రైవ్ చేపట్టారు.

ఈ కార్యక్రమంలో హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తున్న వాహనదారులకు జరిమానాలు విధించకుండా, అక్కడికక్కడే 52 హెల్మెట్లు కొనుగోలు చేయించి వారికి అందజేసి అవగాహన కల్పించారు. హెల్మెట్ ధరించడం జరిమానా తప్పించుకోవడానికే కాకుండా ప్రాణ రక్షణకు అవసరమని పోలీసులు వివరించారు.

ఈ సందర్భంగా యువతకు ప్రత్యేకంగా కౌన్సెలింగ్ నిర్వహించారు. అతివేగం మరియు నిర్లక్ష్య డ్రైవింగ్ వల్ల యువత ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాల పరిస్థితిని వివరించి జాగ్రత్తగా వాహనాలు నడపాలని సూచించారు.

మైనర్లకు వాహనాలు ఇస్తే తల్లిదండ్రులపైనా కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్‌ఐ సూర్యభగవాన్ హెచ్చరించారు.

పోలీసులు సూచించిన రహదారి భద్రతా నియమాలు:

  • తప్పనిసరిగా నాణ్యమైన హెల్మెట్ ధరించాలి

  • నిర్ణీత వేగ పరిమితిని పాటించాలి

  • డ్రైవింగ్ సమయంలో మొబైల్ ఫోన్ వాడకూడదు

  • ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి

మీ ప్రయాణం సురక్షితంగా ఉండాలని, మీ కుటుంబం మీ కోసం ఎదురుచూస్తోందని గుర్తుంచుకుని జాగ్రత్తగా వాహనాలు నడపాలని చేబ్రోలు ఎస్‌ఐ సూర్యభగవాన్ సూచించారు.