ANDRAPRADESH: జ్యోతిర్మఠ పీఠాధిపతి గోవిందానంద సరస్వతి సంచలన వ్యాఖ్యలు చేశారు. నకిలీ పీఠాధిపతులను ఎవరూ నమ్మొద్దని పిలుపునిచ్చారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి... గోవిందానంద సరస్వతి శుక్రవారం రోజున తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి వారిని దర్శించుకున్నారు.
అనంతరం గోవిందనంద సరస్వతి మీడియాతో మాట్లాడారు. ఈ క్రమంలోనే శృంగేరి పీఠాధిపతి విధుశేఖర భారతిని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు. దేశంలో నకిలీ సన్యాసులు, నకిలీ పీఠాధిపతులు, నకిలీ బాబాలు పెరుగుతున్నారని అన్నారు. ఆంధ్ర దేశంలో కూడా కొంత మంది నకిలీ సన్యాసులు, నకిలీ పీఠాధిపతులు, నకిలీ బాబాల పీడ ఎక్కువైపోతుందని... అలాంటి వారిని ప్రజలు ఎవరూ నమ్మొద్దని కోరారు.
నకిలీ సన్యాసులు, నకిలీ పీఠాధిపతులు, నకిలీ బాబాల, నకిలీ శంకరాచార్యుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని అన్నారు. గత రెండు రోజులుగా శంకరాచార్య పీఠాధీశులు అని చెప్పుకునే నకిలీ వ్యక్తి తిరుమలలో తిరుగుతున్నారని ఆరోపించారు. కర్ణాటక నుంచి వచ్చి తిరుమల తిరుపతిలో తిరుగుతున్నారని విమర్శించారు. దేశంలో ప్రస్తుతం ఇద్దరే శంకరాచార్యులున్నారని అన్నారు. ఒకరు శృంగేరీ పీఠాధిపతి, ఇంకొకరు పూరీ గోవర్దన పీఠాధిపతి మాత్రమేనని చెప్పారు. పరంపరంగా ఉన్న శంకరాచార్యులవారు అని పేర్కొన్నారు.
విధుశేఖర భారతి పీఠాధిపతి కాదని గోవిందానంద సరస్వతి అన్నారు. ఆయన శంకరాచార్యుల వారు కాదని అన్నారు. శ్రీశైలం గర్భగుడిలోకి వెళ్లి విధుశేఖర భారతి పాపం చేశారని ఆరోపించారు. విదుశేఖర భారతి నకిలీ శంకరాచార్యులు అని తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామి సన్నిధిలో డిక్లేర్ చేస్తున్నామని తెలిపారు.
తిరుపతిలో 400 మంది పండితులతో భారీ పండిత సభ నిర్వహించనున్నట్టుగా గోవిందానంద సరస్వతి చెప్పారు. ఆది శంకరాచార్యులపై తప్పుడు ప్రచారాలను ఖండించేందుకు సభ ఏర్పాటు చేస్తున్నట్టుగా తెలిపారు.



.jpeg)