Ticker

6/recent/ticker-posts

99 రోజులు మానసిక క్షోభకు గురిచేశారు...: జైలు నుంచి విడుదలైన పిన్నెల్లి


ఆంధ్రప్రదేశ్, మాచర్ల: వైసీపీ నేత, పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి జైలు నుంచి విడుదలయ్యారు. టీడీపీ నేతలు జెవిశెట్టి వెంకటేశ్వర్లు, జెవిశెట్టి కోటేశ్వరరావులు హత్య కేసులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, పిన్నెల్లి వెంకట్రామిరెడ్డి‌లు నిందితులుగా ఉన్న సంగతి తెలిసిందే. వీరు గత కొంతకాలంగా నెల్లూరు జైలులో ఉంటున్నారు. అయితే గురజాల 10వ అదనపు కోర్టు జడ్జి ప్రియదర్శిని బుధవారం రోజున ఈ కేసులో జైలులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి బెయిల్ మంజూరు చేశారు. దీంతో పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి ఈరోజు నెల్లూరు జైలు నుంచి నుంచి విడుదలయ్యారు. జైలు నుంచి బయటకు వచ్చిన పిన్నెల్లి రామకృష్ణా రెడ్డికి పలువురు వైసీసీ నాయకులు స్వాగతం పలికారు.


జైలు నుంచి బయటకు వచ్చిన అనంతరం పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి మీడియాతో మాట్లాడుతూ... పెందుర్తి మండలంలో టీడీపీ వర్గాల గొడవలో తనపై అక్రమ కేసు బనాయించారని ఆరోపించారు. ఆధిపత్య పోరులో జరిగిన హత్యల ఘటనకు సంబంధించి ఉద్దేశపూర్వకంగా తమను ఇరికించారని అన్నారు. ఆనాటి ఎస్పీ సైతం ఈ హత్యలు ఇరువర్గాల పోరుగా తేల్చారని... అయినప్పటికీ తమని అన్యాయంగా జైలుకు పంపించారని చెప్పుకొచ్చారు. భవిష్యత్తులో తమకు తప్పకుండా ఒక రోజు వస్తుందని... ఆరోజు దీని వెనుక ఎవరు ఉన్నారో బయటకు లాగుతామని అన్నారు. ఇందులో ఎవ్వరినీ వదిలిపెట్టే సమస్య లేదని చెప్పారు. రాజకీయ నాయకులు, అధికారులు ఎవ్వరు ఉన్నా చట్టం ముందు నిలబెడుతామని అన్నారు. తనను 99 రోజులు జైల్లో పెట్టి మానసిక క్షోభకు గురిచేశారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇక, గతేడాది మే 24న మాచర్ల నియోజకవర్గం వెల్దుర్తి మండలం గుండ్లపాడు గ్రామానికి చెందిన టీడీపీ నేతలు జవ్విశెట్టి వెంకటేశ్వరరావు, జవ్విశెట్టి కోటేశ్వరరావులు హత్యకు గురయ్యారు. ఈ కేసులో పిన్నెల్లి సోదరులపై కేసు నమోదు అయ్యింది. ఈ జంట హత్యల కేసులో A6 మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, A7 పిన్నెల్లి వెంకటరామిరెడ్డిలను చేర్చారు.అయితే ముందస్తు బెయిల్ మంజరు అయింది. కానీ తర్వాత వారి ముందస్తు బెయిల్‌ను సుప్రీం కోర్టు రద్దు చేసింది. అంతేకాదు లొంగిపోవాలని కోర్టు ఆదేశించడంతో పిన్నెల్లి సోదరులు గతేడాది డిసెంబర్ 11న కోర్టులో లొంగిపోయారు. ఆ తర్వాత నుంచి బెయిల్ కోసం ప్రయత్నాలు చేశారు. అయితే ఈ క్రమంలోనే తాజాగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి గురజాల కోర్టు బెయిల్ మంజూరు చేసింది.