Ticker

6/recent/ticker-posts

ఏపీలో మున్సిపల్ ఎన్నికలు అప్పుడే.. మంత్రి కీలక ప్రకటన


ANDRAPRADESH: ఏపీ మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై కీలక అప్‌డేట్ వచ్చింది. ఏపీలో మున్సిపల్ ఎన్నికలను వచ్చే ఏడాది నిర్వహిస్తామని మంత్రి పొంగూరు నారాయణ వెల్లడించారు. మంత్రి నారాయణ సోమవారం ప్రకాశం జిల్లాలో పర్యటించారు. పలు అభివృద్ధి పనులను పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన నారాయణ ప్రస్తుతం జనగణన నడుస్తోందని.. జనగణన పూర్తి అయిన తర్వాత 2027లో ఏపీలో మున్సిపల్ ఎన్నికలు నిర్వహిస్తామని మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ వెల్లడించారు.


ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారనే దానిపై కీలక అప్‌‍డేట్ వచ్చింది. ప్రకాశం జిల్లా పర్యటనలో మంత్రి పొంగూరు నారాయణ మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై క్లారిటీ ఇచ్చారు.ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ సోమవారం ప్రకాశం జిల్లాలోని.. కందుకూరులో పర్యటించారు. ఈ సందర్భంగా కందుకూరులో చేపడతున్న వివిధ అభివృద్ధి పనులను స్థానిక ఎమ్మెల్యేతో కలిసి మంత్రి నారాయణ పరిశీలించారు. టిడ్కో కాలనీ, MIG లేఅవుట్, రోడ్ డివైడర్లు, సెంట్రల్ లైటింగ్‌కు సంబంధించిన పనులను సమీక్షించారు.

అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రి నారాయణ.. ఎంఐజీ లేఅవుట్ పనులు త్వరలోనే ప్రారంభమవుతాయని వెల్లడించారు. వైసీపీ ప్రభుత్వం టిడ్కో ఇళ్లను మధ్యలోనే నిలిపివేసిందని మంత్రి నారాయణ.. గత ఐదు సంవత్సరాలలో 50,000 ఇళ్లను కూడా పూర్తి చేయలేకపోయిందని ఆరోపించారు. వచ్చే జూన్ నాటికి టిడ్కో గృహాల నిర్మాణం 163 చోట్ల పూర్తవుతుందని.. ఇళ్ల నిర్మాణం పూర్తైన వెంటనే కుళాయి నీటి కనెక్షన్లు అందిస్తామని వెల్లడించారు.

మరోవైపు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కందుకూరు అభివృద్ధి కోసం ప్రకటించిన రూ.50 కోట్లలో.. రూ.20 కోట్లు ఇప్పటికే విడుదల చేశామని.. మిగిలిన రూ.30 కోట్లు త్వరలో విడుదల చేస్తామని మంత్రి నారాయణ ప్రకటించారు. ఈ క్రమంలోనే ఏపీలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఏడాది కేంద్రం జనగణన చేపట్టిందన్న మంత్రి నారాయణ.. డిసెంబర్ వరకూ జనగణన ఉంటుందన్నారు. జనగణన పూర్తైన తర్వాత 2027లో ఏపీలో మున్సిపల్ ఎన్నికలు నిర్వహిస్తామని మంత్రి నారాయణ వెల్లడించారు.

మరోవైపు ఏపీలో సర్పంచుల పదవీ కాలం ఈ ఏడాది ఏప్రిల్ నెలతో ముగియనుంది. అలాగే నగరపాలక, పురపాలికల్లో కార్పొరేటర్లు, కౌన్సిలర్ల పదవీకాలం కూడా ఈ ఏడాదిలోనే ముగియనుంది. అయితే పదవీకాలం పూర్తి కావటానికి మూడు నెలల ముందే ఎన్నికలు నిర్వహించాలని చట్టాలు చెప్తున్నాయి. దీంతో జనవరిలోనే ఎన్నికలకు నిర్వహించాలని గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం భావించింది. అయితే జనగణన నేపథ్యంలో ఈ ప్రక్రియ వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి.

మరోవైపు జనగణన నేపథ్యంలో గ్రేటర్ విజయవాడ, గ్రేటర్ తిరుపతి ప్రతిపాదనలను సైతం ఏపీ ప్రభుత్వం ఇటీవల తాత్కాలికంగా పక్కనబెట్టిన సంగతి తెలిసిందే. అధికార యంత్రాంగం మొత్తం జనగణన పనుల్లో ఉంటుందనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.