Ticker

6/recent/ticker-posts

వైఎస్ జగన్ ఇలాఖాలో వైసీపీకి షాక్.. ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం


ANDRAPRADESH, KADAPA: ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది. వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గం కడపలో వైసీపీకి గట్టి దెబ్బ తగిలింది. BY: SR TV NEWS కడప మేయర్ సురేష్‌బాబుపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనర్హత వేటు వేసింది. కడప మేయర్ పదవి నుంచి సురేష్ బాబును ఏపీ ప్రభుత్వం తొలగించింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి తాజాగా ఆదేశాలు జారీ చేశారు. విజిలెన్స్ నివేదిక ఆధారంగా కడప మేయర్ పదవి నుంచి సురేష్ బాబును తొలగిస్తున్నట్లు ఏపీ మున్సిపల్ శాఖ తన ఉత్తర్వుల్లో పేర్కొంది.


కడప మేయర్‌గా పనిచేస్తూ సురేష్ బాబు.. కడపలోని అభివృద్ధి పనుల కాంట్రాక్టులను తన కుటుంబానికి చెందిన సంస్థకు అప్పగించారని ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలపై ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించగా.. విజిలెన్స్ నివేదిక ఆధారంగా సురేష్ బాబును కడప మేయర్ పదవి నుంచి తొలగిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. మున్సిపల్ చట్టం నిబంధనలు అతిక్రమించిన నేపథ్యంలో కడప మేయర్ మీద అనర్హత వేటు వేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

మరోవైపు కడప అభివృద్ధి పనులను తన కుటుంబానికి చెందిన ఎంఎస్ వర్దిని కన్‌స్ట్రక్షన్స్‌కు అప్పగించినట్లు సురేష్ బాబు మీద ఆరోపణలు వచ్చాయి. రూ. 36 లక్షల అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. ఇక ఎంఎస్ వర్ధిని కన్‌స్ట్రక్షన్స్ కంపెనీ డైరెక్టర్లుగా సురేష్ బాబు కుమారుడు అమరేష్, భార్య జయశ్రీ వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో మేయర్‌ పదవిలో ఉంటూ తన కుటుంబసభ్యులకు కాంట్రాక్టు పనులు అప్పగించారంటూ సురేష్ బాబుపై ఆరోపణలు వచ్చాయి. దీనిపై ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించగా.. విజిలెన్స్ దర్యాప్తులో పలు ఆధారాలు సేకరించారు. ఇదే సమయంలో సురేష్ బాబును సైతం మంగళవారం మున్సిపల్ శాఖ అధికారులు విచారించారు. మంగళవారం మున్సిపల్‌శాఖ కార్యదర్శి ఎదుట సురేష్‌బాబు తన వివరణ తెలియజేశారు. అయితే బుధవారం విజిలెన్స్ కమిషనర్ నివేదిక ఆధారంగా ఏపీ పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి కడప మేయర్ మీద అనర్హత వేటు వేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

మరోవైపు కడప ఎమ్మెల్యే రెడ్డెప్పగారి మాధవి రెడ్డితో విభేదాల కారణంగా కడప మేయర్ సురేష్ బాబు గత కొన్ని నెలలుగా వార్తల్లో నిలుస్తూ వచ్చారు. ఓ సారి కడప మేయర్ ఇంటి వద్ద చెత్త వేయటంతో సురేష్ బాబు అప్పట్లో వార్తల్లో నిలిచారు. కడప నగరపాలక సంస్థ సమావేశాలు జరిగే సందర్భంగా ఎమ్మెల్యే మాధవి రెడ్డి, కడప మేయర్ సురేష్ బాబు మధ్య వాగ్వాదం జరిగిన ఘటనలు కూడా ఉన్నాయి.