Ticker

6/recent/ticker-posts

తూర్పుగోదావరి జిల్లాలో ఘరానా దొంగ అరెస్ట్.. జూదం కోసం వరుస చోరీలు.. బెయిల్‌పై బయటకు వచ్చి!


ANDRAPRADESH, POLAVARAM, JUN 05: తూర్పుగోదావరి జిల్లాలో వరుస చోరీలకు పాల్పడుతున్న ఓ నిందితుడిని అనపర్తి పోలీసులు, రాజమహేంద్రవరం క్రైమ్ బ్రాంచ్ సిబ్బంది సంయుక్తంగా అరెస్టు చేశారు. జూదం కోసం వరుస చోరీలకు పాల్పడి కటకటాలు పాలయ్యాడు. జైలు నుండి బెయిల్‌పై బయటకు వచ్చి మళ్లీ దొంగతనాలు మొదలుపెట్టాడు. పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి.. ఘరానా దొంగను అరెస్ట్ చేసారు.


పోలవరం జిల్లా అడ్డతీగల మండలం గొంతువానిపాలెం గ్రామానికి చెందిన చిలపనశెట్టి సన్యాసిరావు జూదానికి బానిసై.. డబ్బుల కోసం చోరీలను వృత్తిగా మార్చుకున్నాడు. 2019 నుంచి రాత్రి వేళల్లో తాళాలు వేసి ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకుని.. తాళాలు పగులగొట్టి బంగారం, వెండి ఆభరణాలను అపహరిస్తూ వచ్చాడు. అతనిపై ఇప్పటికే 45 చోరీ కేసులు నమోదై ఉండగా.. ఐదు కేసుల్లో శిక్ష కూడా అనుభవించాడు. మరో 20 కేసులు ప్రస్తుతం కోర్టుల్లో విచారణలో ఉన్నాయి. ఆత్రేయపురం పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన ఓ చోరీ కేసులో అరెస్టై రిమాండ్‌కు వెళ్లిన సన్యాసిరావు.. ఈ ఏడాది మార్చి 26న బెయిల్‌పై విడుదలయ్యాడు.

జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా సన్యాసిరావు తన తీరు మార్చుకోకుండా.. మార్చి 31న అనపర్తి మండలం లక్ష్మీనరసాపురంలో తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీకి పాల్పడ్డాడు. అనంతరం కోరుకొండ, రావులపాలెం, ఆలమూరు, నర్సీపట్నం పరిసర ప్రాంతాల్లో మరో ఆరు చోరీలు చేశాడు. లక్ష్మీనరసాపురం చోరీ కేసు దర్యాప్తులో భాగంగా నిందితుడు అనపర్తి మండలం కొప్పవరం బ్రిడ్జి సమీపంలో సంచరిస్తున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు అక్కడికి చేరుకుని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో అతను పలు చోరీలకు పాల్పడినట్లు అంగీకరించాడు. నిందితుడి వద్ద నుంచి రూ.58.09 లక్షల విలువైన 385 గ్రాముల బంగారం, 110 గ్రాముల వెండి వస్తువులు, రూ.5 వేల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను రాజమహేంద్రవరం డీఎస్పీ విద్య మీడియాకు వెల్లడించారు.