Ticker

6/recent/ticker-posts

రేవంత్‌కు రైతుల శాపం తప్పదు.. తెలంగాణలో మళ్లీ బీఆర్ఎస్ జెండా ఎగురుతుంది


TELANGANA, HYDERABAD, JUN 07: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ కీలక నేత హరీష్ రావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రేవంత్ రెడ్డి ఎంత ప్రయత్నించినా, రాబోయే రోజుల్లో వంద సీట్లతో తెలంగాణలో మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమవడమే దీనికి ప్రధాన కారణమని ఆయన పేర్కొన్నారు.


రైతు బంధుపై నిర్లక్ష్యం.. కేసీఆర్ పాలనే ఆదర్శం
ఎన్నికల సమయంలో ఇచ్చిన స్కాలర్‌షిప్‌లు, రైతు బంధు వంటి అనేక కీలక హామీలను ఈ ప్రభుత్వం ఇప్పటికీ నెరవేర్చలేదని హరీష్ రావు మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో ఏ ఒక్క రైతు కూడా రేవంత్ రెడ్డికి ఓటు వేసే పరిస్థితి లేదని స్పష్టం చేశారు. గతంలో కేసీఆర్ కేవలం ఓట్ల కోసం రైతు బంధు పథకాన్ని ప్రవేశపెట్టలేదని, రైతులపై ఉన్న గుండె నిండా ప్రేమతోనే దానిని అమలు చేశారని గుర్తు చేశారు. తమ పాలనలో 11 విడతల్లో ఏకంగా 73 వేల కోట్ల రూపాయలను రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేసిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని కొనియాడారు. రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో ఎక్కడికి వెళ్లినా గుళ్లలో ఒట్లు వేస్తూ హామీలు ఇచ్చారని, కానీ అధికారంలోకి వచ్చాక వాటిని నెరవేర్చడం లేదని విమర్శించారు.

సంక్షోభంలో వ్యవసాయ రంగం
కేసీఆర్ పాలనలో రాష్ట్రంలో ఎరువుల కొరత అనేదే లేదని, కానీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులు క్యూ లైన్లలో నిలబడి ఎరువులు కొనుగోలు చేయాల్సిన దుస్థితి వచ్చిందని హరీష్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. గడిచిన నాలుగు నెలలుగా తెలంగాణలో ‘రైతు బీమా’ నిలిచిపోయిందని, మార్కెట్లలో మక్కలను (మొక్కజొన్న) కొనే నాథుడే లేకుండా పోయాడని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పాలనలో రైతులకు, వారి భూములకు విలువ తగ్గిపోయిందని, రైతులకు నిజమైన విలువ కల్పించింది కేసీఆర్ మాత్రమేనని అన్నారు.

ఉచిత విద్యుత్‌కు ఎసరు.. ‘రైతు డిస్కం’పై మండిపాటు
రానున్న రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ‘రైతు డిస్కం’ తీసుకురావాలని చూస్తోందని, దీని వెనుక రైతులకు 24 గంటల ఉచిత కరెంట్‌ను నిలిపివేయాలనే కుట్ర దాగి ఉందని హరీష్ రావు ఆరోపించారు. రేవంత్ సర్కార్ ఈ విధానం ద్వారా రైతులకు తీవ్ర అన్యాయం చేయాలని చూస్తోందని, ఒకవేళ దీనిని అమలు చేస్తే కాంగ్రెస్ నాయకులు గ్రామాల్లో తిరిగే పరిస్థితి కూడా ఉండదని హెచ్చరించారు. రైతులను ఇబ్బంది పెడుతున్న రేవంత్ రెడ్డికి వారి ఉసురు తగలడం ఖాయమని శాపనార్థాలు పెట్టారు.

ప్రస్తుత రేవంత్ రెడ్డి పాలన హిట్లర్ సర్వాధికార పాలనను తలపిస్తోందని హరీష్ రావు తీవ్ర విమర్శలు చేశారు. అందుకే సామాన్య ప్రజల ఇళ్లను నిర్ధాక్షిణ్యంగా కూలగొడుతున్నారని ఆరోపించారు. స్థానిక సమస్యలపై సోషల్ మీడియాలో ప్రశ్నించిన వారిని పోలీసులతో కొట్టించడం దారుణమన్నారు. రేవంత్ రెడ్డి చేస్తున్న ఈ ప్రజావ్యతిరేక పాలన వల్ల భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలకు జీవితాంతం క్షమాపణలు చెప్పుకోవాల్సి వస్తుందని అన్నారు. రానున్నది తమ ప్రభుత్వమేనని, అక్రమాలకు పాల్పడుతున్న ప్రతి ఒక్కరూ దీనిని గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. పార్టీ కోసం కష్టపడుతున్న కార్యకర్తలను బీఆర్ఎస్ అధిష్టానం గుండెల్లో పెట్టుకుని కాపాడుకుంటుందని హరీష్ రావు భరోసా ఇచ్చారు.