Ticker

6/recent/ticker-posts

జనసేనలో సంస్థాగత పునర్వ్యవస్థీకరణ.. పవన్ కళ్యాణ్ మాస్టర్ ప్లాన్ ఇదే..


ANDRAPRADESH, MANGALAGI, JUN 05: ఆంధ్రప్రదేశ్ అధికార పక్షంలో కీలక భాగస్వామిగా ఉన్న జనసేన పార్టీలో భారీ సంస్థాగత పునర్వ్యవస్థీకరణకు అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శ్రీకారం చుట్టారు. కేడర్ ఆధారిత బలమైన నాయకత్వ వ్యవస్థను నిర్మించడమే లక్ష్యంగా, రాష్ట్రవ్యాప్తంగా ‘నిర్మాణ సమాచార సేకరణ కమిటీల’ను ఆయన నియమించారు. కేవలం ఎన్నికల విజయాలకే పరిమితం కాకుండా, దీర్ఘకాలిక రాజకీయ ప్రయోజనాల కోసం పార్టీని క్షేత్రస్థాయి నుంచి పటిష్ఠం చేసే వ్యూహాత్మక అడుగుగా దీనిని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.


భవిష్యత్ నాయకత్వమే లక్ష్యం..
రాష్ట్రంలోని 25 పార్లమెంట్, 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీని క్షేత్రస్థాయి నుండి పునర్నిర్మించేందుకు ఈ కసరత్తు మొదలైంది. నిన్నటివరకు సాధారణ కార్యకర్తలుగా, జనసైనికులుగా ఉన్న వారి నుంచే భవిష్యత్తు రాజకీయ నాయకత్వాన్ని తీర్చిదిద్దే ఒక వినూత్న ప్రక్రియకు పవన్ కళ్యాణ్ రూపకల్పన చేశారు. పార్టీ కోసం మొదటి నుంచి అంకితభావంతో, నిరూపితమైన సేవలందించిన ప్రతి ఒక్కరినీ గుర్తించేందుకు ఈ ప్రత్యేక కమిటీలు పనిచేస్తాయి.

పకడ్బందీగా కమిటీల కూర్పు..
సంస్థాగత మార్పుల్లో భాగంగా ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి 28 మంది సభ్యులతో కూడిన ఒక జంబో కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీల్లో ఒక పరిశీలకుడు, సీనియర్ నాయకులు, క్రియాశీలక సాధకులతో పాటు ‘వీరమహిళల’కు సైతం సరైన గుర్తింపు, తగిన ప్రాధాన్యత కల్పించారు. ఈ కమిటీల కూర్పుకు సంబంధించిన ప్రతి అంశాన్ని పవన్ కళ్యాణ్ స్వయంగా సమీక్షించి ఆమోదముద్ర వేయడం విశేషం. దశాబ్దన్నర క్రితమే పవన్ మనసులో రూపుదిద్దుకున్న రాజకీయ ఆలోచనలకు, ఆశయాలకు కార్యరూపమే ఈ నియామకాలు.

అర్హులకే పదవులు.. పవన్ కళ్యాణ్ తుది నిర్ణయం..
ఈ కమిటీలు క్షేత్రస్థాయి నాయకులు, కార్యకర్తల పనితీరు, వారి నాయకత్వ లక్షణాలు, అంకితభావంపై సమగ్రంగా అధ్యయనం చేసి ఒక నివేదికను రూపొందిస్తాయి. ఈ క్షేత్రస్థాయి సమాచారాన్ని, సేకరించిన నివేదికలను పూర్తిగా పరిశీలించిన తర్వాతే పార్టీలో వివిధ బాధ్యతల కేటాయింపులు జరుగుతాయి. అర్హత, కష్టపడే తత్వమే ప్రామాణికంగా సాగే ఈ ప్రక్రియలో తుది నిర్ణయం పూర్తిగా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ చేతుల్లోనే ఉంటుంది. కష్టపడిన ప్రతి జనసైనికుడికి సముచిత గుర్తింపు కల్పించడమే ఈ భారీ రాజకీయ కసరత్తు ముఖ్య ఉద్దేశం.