Ticker

6/recent/ticker-posts

సోలార్ విద్యుత్ దిశగా దేశం.. 40 లక్షల ఇళ్లకు చేరిన ‘పీఎం సూర్య ఘర్’ పథకం


INDIA NEWS, JUN 05: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోన్న ‘పీఎం సూర్య ఘర్’ పథకం సత్‌ఫలితాన్ని ఇస్తోంది. దేశమంతా సోలార్ ఇళ్లులుగా మారుతున్నాయి. దేశంలో వేగంగా విస్తరిస్తున్న పథకాల్లో ‘పీఎం సూర్య ఘర్’ పథకం ఒకటిగా నిలవడం విశేషం. ప్రారంభమైన రెండేళ్లలోనే ఈ పథకం ద్వారా 40 లక్షల కుటుంబాలు లబ్ధి పొందాయని కేంద్ర ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి వెల్లడించారు. 2026 డిసెంబర్ నాటికి ఈ సంఖ్యను 75 లక్షల కుటుంబాలకు పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.


ఒక కార్యక్రమంలో మాట్లాడిన కేంద్రమంత్రి.. ప్రస్తుతం ఈ పథకం కింద 65 లక్షలకు పైగా దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని చెప్పారు. పథకం ప్రారంభానికి ముందు నెలకు సుమారు 7 వేల రూఫ్‌టాప్ సోలార్ వ్యవస్థలు మాత్రమే ఏర్పాటు అవుతుండగా.. ఇప్పుడు నెలకు 3 లక్షలకు పైగా ఇన్‌స్టాలేషన్లు జరుగుతున్నాయని పేర్కొన్నారు.

రికార్డు స్థాయిలో అమలు
లక్ష ఇళ్లను పథకంలో చేర్చడానికి గతంలో 118 రోజులు పట్టేదని.. ప్రస్తుతం అదే పనిని ఎనిమిది రోజుల్లోపు పూర్తి చేస్తున్నామని తెలిపారు. ఇప్పటివరకు ఈ పథకం కింద రూ.22,750 కోట్లకు పైగా సబ్సిడీలు విడుదల చేశామని.. అందులో 2026 మే నెలలోనే రూ.2,743 కోట్లు చెల్లించినట్లు వెల్లడించారు. రూఫ్‌టాప్ సోలార్ వ్యవస్థల ఏర్పాటు వల్ల ఇప్పటికే 17 లక్షలకుపైగా కుటుంబాలు జీరో విద్యుత్ బిల్లులను సాధించాయని కేంద్రం తెలిపింది.

ప్రపంచంలోనే అతిపెద్ద పథకం
2024 ఫిబ్రవరి 13న రూ.75,021 కోట్ల వ్యయంతో ప్రారంభమైన ఈ పథకం ప్రస్తుతం ప్రపంచంలోనే అతిపెద్ద గృహ రూఫ్‌టాప్ సోలార్ కార్యక్రమంగా మారింది. దేశవ్యాప్తంగా కోటి మందికి పైగా కుటుంబాలు జాతీయ పోర్టల్‌లో నమోదు చేసుకోగా.. 2026 మే నాటికి 33 లక్షలకుపైగా రూఫ్‌టాప్ సోలార్ వ్యవస్థలు ఏర్పాటు అయ్యాయి. దీంతో 12 గిగావాట్లకు పైగా సోలార్ విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం అందుబాటులోకి వచ్చింది. మే నెలలో ఒక్క నెలలోనే 3.16 లక్షల సోలార్ ఇన్‌స్టాలేషన్లు నమోదవగా.. ఒకే రోజులో 15 వేల కుటుంబాలు ఈ పథకంలో చేరడం విశేషం.

ఇంధన భద్రతకు బలమైన అడుగు
పశ్చిమాసియా సంక్షోభం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఇంధన అనిశ్చితులు నెలకొన్న సమయంలో పీఎం సూర్య ఘర్ పథకం భారత్ ఇంధన భద్రతను మరింత బలోపేతం చేస్తోందని ప్రహ్లాద్ జోషి అన్నారు. 2030 నాటికి 500 గిగావాట్ల జీవాశ్మేతర ఇంధన సామర్థ్యాన్ని సాధించాలన్న భారత లక్ష్యానికి ఈ పథకం కీలకంగా దోహదపడుతుందని పేర్కొన్నారు. దేశంలో మొత్తం సోలార్ విద్యుత్ సామర్థ్యం 2026 మార్చి నాటికి 150 గిగావాట్లను దాటినట్లు కేంద్రం వెల్లడించింది.