Ticker

6/recent/ticker-posts

విశాఖలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి, పలువురికి తీవ్ర గాయాలు!


ఆంధ్రప్రదేశ్, విశాఖపట్నం, మే 31: గాజువాక శ్రీనగర్ సమీపంలో ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. టైరు పంక్చర్ కావడంతో రోడ్డు పక్కన నిలిపి వుంచిన టిప్పర్ లారీని ఏపీఎస్‌ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు వెనుక నుంచి ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు బస్సు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. మృతుల్లో ఇద్దరు మహిళలు ఉండగా.. మరొకరు బస్సు అసిస్టెంట్ డ్రైవర్‌గా పోలీసులు గుర్తించారు. మరో పది మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు.


రోడ్డు ప్రమాదం సమాచారం తెలిసిన పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం విశాఖపట్నంలోని కింగ్ జార్జ్ హాస్పిటల్ (కేజీహెచ్)కు తరలించారు. ప్రమాదానికి గురైన బస్సు పార్వతీపురం డిపోకు చెందిన ఏపీఎస్‌ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సుగా గుర్తించారు. ఈ బస్సు రాజమండ్రి నుంచి పార్వతీపురం వెళ్తున్న సమయంలో ప్రమాదానికి గురైనట్లు అధికారులు తెలిపారు.

ప్రాథమిక సమాచారం ప్రకారం.. టైరు పంక్చర్ కారణంగా రోడ్డు పక్కన నిలిపిన లారీని బస్సు డ్రైవర్ గుర్తించలేకపోవడంతో ఈ ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు. అయితే ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ విషాద ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. మృతుల కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.