ఆంధ్ర ప్రదేశ్, అమరావతి, మే, 14: ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపు మేరకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన వాహన శ్రేణిని కుదించుకున్నారు. మొత్తం 12 వాహనాల కాన్వాయ్ను 4 వాహనాలకు తగ్గించుకున్నారు. ఇవాల్టి నుంచే ఈ వాహన శ్రేణి కుదింపును అమల్లోకి తీసుకురావాలని సీఎం సూచనలు జారీ చేశారు.
ఈ మేరకు ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి సచివాలయంలో జరిగే కేబినెట్ సమావేశానికి కేవలం నాలుగు వాహనాల కాన్వాయ్తోనే సీఎం చేరుకున్నారు. ఇక నుంచి ఈ నాలుగు వాహన కాన్వాయ్ శ్రేణితోనే ప్రయాణించాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. సీఎం కాన్వాయ్ కుదించడంతో భద్రతా సిబ్బంది కోసం ప్రత్యేక బస్సు ఏర్పాటు చేశారు. కొంతకాలం సీఎం వెంట బస్సులోనే ఎన్ఎస్జి వెళ్లనుంది. అటు మంత్రులు, ప్రజాప్రతినిధులు కూడా ఈ మేరకు వాహన శ్రేణిని తగ్గించుకుని ఇంధనాన్ని ఆదా చేయాలని సీఎం సూచించారు.
ఈ మేరకు మంత్రులు కూడా తమ కాన్వాయ్లోని వాహనాలను తగ్గించుకున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా తమ కాన్వాయ్లో వాహనాలను తగ్గించుకున్నారు. ప్రధాని మోడీ డీజిల్, పెట్రోల్ పొదుపు చేయాలనడంతో అందరూ ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు. గతంలో 5 వాహనాలు రోజుకు అమ్ముడయ్యే చోట.. ఇప్పుడు 10 నుంచి 15 అమ్ముడవుతున్నాయి.

