Ticker

6/recent/ticker-posts

ఉత్తరాంధ్రలో రెండేళ్లలో కీలక ప్రాజెక్టులు పూర్తి: మంత్రి నిమ్మల


అమరావతి, ఏప్రిల్ 28: రానున్న రెండేళ్లలో ఉత్తరాంధ్రలో రూ.2 వేల కోట్లతో 11 కీలక ప్రాజెక్టులు పూర్తి చేయాలని సీఎం నారా చంద్రబాబు నాయుడు లక్ష్యంగా నిర్దేశించుకున్నారని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. మంగళవారం రాజధాని అమరావతిలో ఉత్తరాంధ్ర ఇరిగేషన్ ప్రాజెక్టుల పురోగతిపై ఆ శాఖ ఉన్నతాధికారులతో మంత్రి నిమ్మల రామానాయుడు సమీక్ష జరిపారు.


ఈ సందర్భంగా మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ.. కీలకమైన 11 ప్రాజెక్టులు పూర్తి చేయడం ద్వారా ఉత్తరాంధ్రలో 2.69 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుతో పాటు 2.49 లక్షల ఎకరాల ఆయకట్టు స్ధిరీకరణ సాధ్యమౌతుందని చెప్పారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టు సాగులోకి తీసుకురావడంతో పాటు, కరువు ప్రాంతాలకు ప్రయోజనం కలిగించే ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు ఆయన వివరించారు.

వంశధార ట్రిబ్యునల్ 2021 తీర్పును గెజిట్‌లో చేరుస్తూ నోటిఫికేషన్ ఇవ్వడంలో సీఎం చంద్రబాబు కృషి ఫలించిందని పేర్కొన్నారు. కేంద్రం ఇచ్చిన గెజిట్ నోటిఫికేషన్‌తో శ్రీకాకుళం జిల్లాలోని నేరడి బ్యారేజ్ నిర్మాణానికి అడ్డంకులు తొలగిపోయాయని చెప్పారు. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో ఉత్తరాంధ్రలో ఇరిగేషన్ ప్రాజెక్టులకు ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదని మండిపడ్డారు. ఈ సమీక్షా సమావేశంలో నీటి పారుదల సలహాదారు వెంకటేశ్వరరావు, ఈఎన్సీ నరసింహమూర్తితోపాటు ఉత్తరాంద్రలోని నీటి పారుదల శాఖ ఉన్నతాధికారులు, ఏజెన్సీల ప్రతినిధులు పాల్గొన్నారు.