Ticker

6/recent/ticker-posts

ప్రభుత్వ పాఠశాల విద్యార్థినికి ఎమ్మెల్యే అభినందనలు


లింగపాలెం, ఏప్రిల్ 30: లింగపాలెం మండలం రంగాపురం జడ్‌పీహెచ్ ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి ఫలితాల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థిని కనిపెడ వంశికను శాసనసభ్యులు సొంగా రోషన్ కుమార్ అభినందించారు. వేములపల్లి గ్రామానికి చెందిన వంశిక 600 మార్కులకు గాను 576 మార్కులు సాధించి మండల స్థాయిలో ప్రభుత్వ పాఠశాలల్లో మొదటి స్థానాన్ని పొందింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆమెను సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.

విద్యార్థిని సాధించిన విజయాన్ని ప్రశంసిస్తూ ఎమ్మెల్యే మాట్లాడుతూ కష్టపడి చదివితే విజయం తప్పకుండా సాధ్యమని పేర్కొన్నారు. భవిష్యత్తులో మరింత ఉన్నత లక్ష్యాలను ఏర్పరచుకొని వాటిని సాధించాలని విద్యార్థులకు సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు కూడా అద్భుత ఫలితాలు సాధించగలరని వంశిక నిరూపించిందని తెలిపారు.

ఈ సందర్భంగా ఉపాధ్యాయుల పాత్రను ప్రత్యేకంగా కొనియాడారు. విద్యార్థుల విజయంలో ఉపాధ్యాయుల కృషి ఎంతో కీలకమని పేర్కొన్నారు. తల్లిదండ్రులు కూడా పిల్లలను ప్రోత్సహిస్తూ వారి అభ్యాసంలో తోడ్పాటు అందించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో లింగపాలెం మండల విద్యాశాఖ అధికారి జె. రవీంద్ర, పాఠశాల ప్రధానోపాధ్యాయులు బి. వెంకటరత్నం, విద్యార్థిని తండ్రి సువర్ణరాజు, ఉపాధ్యాయులు పాల్గొని వంశికను అభినందించారు. కార్యక్రమం ఆనందోత్సాహాలతో సాగింది.