ఆంధ్రప్రదేశ్, అనంతపురం: జిల్లాలో రాయలసీమ అభివృద్ధి, ముఖ్యంగా నీటి ప్రాజెక్టుల అంశంపై రాజకీయ వాతావరణం వేడెక్కింది. ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, మాజీ మంత్రి శైలజానాథ్లు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్పై తీవ్ర విమర్శలు గుప్పించారు. కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ, రాయలసీమ సాగు, తాగునీటి సమస్యలను తీర్చిన ఘనత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికే దక్కుతుందని అన్నారు. అదే స్ఫూర్తితో వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును చేపట్టారని పేర్కొన్నారు. అయితే చంద్రబాబు నాయుడు రాయలసీమకు అన్యాయం చేశారని, హైకోర్టు, ఎయిమ్స్ వంటి కీలక ప్రాజెక్టులను ఇతర ప్రాంతాలకు తరలించారని విమర్శించారు.
రాయలసీమ ప్రజలు టీడీపీ కూటమికి మద్దతు ఇచ్చినప్పటికీ, వారి అభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకోవడంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ విఫలమయ్యారని ఆయన ఆరోపించారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన తర్వాతే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులు నిలిచిపోయాయని చాలా మందికి తెలిసిందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ కూటమికి వ్యతిరేకంగా ఐక్య ఉద్యమాలు అవసరమని పిలుపునిచ్చారు.
ఇక మాజీ మంత్రి శైలజానాథ్ మాట్లాడుతూ, తమకు తెలంగాణకు వ్యతిరేకత లేదని స్పష్టం చేశారు. అయితే తెలంగాణ సీఎం చెప్పారని రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులను నిలిపివేయడం దుర్మార్గమని అభివర్ణించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు వైఖరి అనుమానాస్పదంగా ఉందని విమర్శించారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పూర్తయితేనే శ్రీశైలం ప్రాజెక్టు నుంచి 800 అడుగుల లోతులో నీటిని తీసుకురావడం సాధ్యమవుతుందని, 854 అడుగుల్లో నీరు తరలించడం అసాధ్యమని ఆయన తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా నీటి వాటాలను సాధించవచ్చని చెప్పారు మాజీ మంత్రి శైలజానాథ్..

