విశాఖపట్నం, మార్చి 14: ఏపీలో గ్యాస్ సంక్షోభం లేకుండా ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని హోంమంత్రి వంగలపూడి అనిత(Home Minister Vangalapudi Anitha) స్పష్టం చేశారు. అంతర్జాతీయ పరిస్థితుల నేపథ్యంలో దేశవ్యాప్తంగా గ్యాస్ కొరత గురించి ఆందోళనలు తలెత్తుతుండటంతో రాష్ట్రంలో ఏవిధమైన సంక్షోభం రాకుండా చర్యలు చేపట్టామని ఆమె తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu) ఆర్టీజీఎస్(RTGS) ద్వారా ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారని వెల్లడించారు.
ఆర్టీజీఎస్ రాష్ట్రానికి గుండెలాంటిదిగా హోంమంత్రి పేర్కొన్నారు. అధికారులకు సీఎం చంద్రబాబు తగిన ఆదేశాలు జారీ చేశారన్నారు. గ్యాస్ సరఫరా సాఫీగా సాగేలా చూస్తున్నట్లు హోంమంత్రి వివరించారు. దయచేసి వదంతులను నమ్మొద్దని ప్రజలను కోరారు. గ్యాస్ సరఫరాపై సామాజిక మాధ్యమాల్లో కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తున్నారని హోంమంత్రి అనిత తెలిపారు.
ఈరోజు(శనివారం) ఉదయం సింహాచలం అప్పన్న స్వామిని హోం మంత్రి అనిత దర్శించుకున్నారు. చందనోత్సవం, స్వామివారి కళ్యాణోత్సవం నేపథ్యంలో అధికారులు, అర్చకులతో ఏర్పాట్లపై చర్చించారు. గత సంవత్సరం చందనోత్సవానికి 1,20,000 మంది భక్తులు స్వామివారి దర్శనానికి రావడం జరిగిందని హోంమంత్రి తెలిపారు. ఈ సంవత్సరం భక్తుల సంఖ్య పెరిగే అవకాశం ఉందన్నారు. ఈనెలాఖరిలో మంత్రుల బృందం చందనోత్సవం ఏర్పాట్లపై సమీక్షించనున్నట్లు తెలిపారు. సామాన్య భక్తుల దర్శనానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని హోంమంత్రి అనిత స్పష్టం చేశారు.



.jpeg)