Ticker

6/recent/ticker-posts

కోర్టు విచారణలో ఉన్న కేసుల వేగవంతానికి సమీక్షా సమావేశం


ఏలూరు, ఫిబ్రవరి 28: జిల్లా ఎస్పీ శ్రీ కె. ప్రతాప్ శివ కిషోర్, ఐపీఎస్ ఆదేశాల మేరకు జిల్లా అదనపు ఎస్పీ (అడ్మిన్) శ్రీ ఎన్. సూర్యచంద్రరావు శనివారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలోని సమావేశ మందిరంలో కోర్టు మానిటరింగ్ సెల్ సభ్యులతో కీలక సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా కోర్టు మానిటరింగ్ సిబ్బంది పని తీరును అదనపు ఎస్పీ సమీక్షించి, విచారణలో ఉన్న కేసులను వేగవంతంగా పూర్తి చేయడానికి తగిన సూచనలు మరియు ఆదేశాలు ఇచ్చారు. ఏలూరు, జంగారెడ్డిగూడెం, నూజివీడు, పోలవరం సబ్‌డివిజన్‌లకు చెందిన కోర్టు మానిటరింగ్ సభ్యులతో సమావేశమై కేసుల పురోగతిపై చర్చించారు.

కేసుల విచారణ వేగంగా పూర్తయ్యేందుకు సాక్షులను సకాలంలో కోర్టుకు హాజరుచేయడం అత్యంత అవసరమని అదనపు ఎస్పీ స్పష్టం చేశారు. విచారణలో జాప్యం జరగకుండా చూడాల్సిన బాధ్యత కోర్టు మానిటరింగ్ సెల్ సభ్యులదేనని తెలిపారు. నేరస్తులు శిక్ష తప్పించుకోకుండా, బాధితులకు న్యాయం జరిగేలా సమర్థంగా విధులు నిర్వహించాలని సూచించారు.

ప్రతి రోజు కోర్టులో జరిగిన విచారణ ప్రక్రియను నమోదు చేసి తక్షణమే సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులకు నివేదించాలని ఆదేశించారు. కోర్టుల్లో విచారణలో ఉన్న కేసుల వివరాలను అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ సమీక్షించాలని సూచించారు.

ఈ సమావేశంలో కోర్టు మానిటరింగ్ ఇన్స్పెక్టర్ ఎం. సుబ్బారావు మరియు కోర్టు మానిటరింగ్ సెల్ సభ్యులు పాల్గొన్నారు.