Ticker

6/recent/ticker-posts

ఆమెకు 13, అతడికి 40.. ఆస్తి కోసం ఇదేం కక్కుర్తి.. అడ్డంగా బుక్!


ముక్కుపచ్చలారని 13 ఏళ్ల బాలికను 40 ఏళ్ల వ్యక్తితో వివాహం జరిపించేందుకు ప్రయత్నించారు ఆమె తల్లిదండ్రులు. అనంతరం గుట్టుచప్పుడు కాకుండా పెళ్లి చేశారు. అయితే పోలీసులు రంగంలోకి దిగడంతో అడ్డంగా బుక్ అయ్యారు. ఆస్తి ఆశతో బాలిక తల్లిదండ్రులు ఈ వివాహానికి ఒప్పుకున్నారని తెలిసింది. తర్వాత పోలీసులు ఇరు కుటుంబాలను హెచ్చరించారు. బాలికను బడికి పంపించకుంటే తమ శైలిలో బుద్ధి చెబుతామని వార్నింగ్ ఇచ్చారు. బాల్యవివాహాలపై కఠిన చట్టాలున్నాయని.. కేసు పెడతామని బెదిరించారు.


బాల్య వివాహాలు ముక్కుపచ్చలారని బాలికల జీవితాలను నానం చేస్తున్నాయి. ఇలాంటి వాటిని ఎట్టిపరిస్థితుల్లోనూ అనుమతించేది లేదని చట్టాలు చెబుతున్నా.. గ్రామీణ ప్రాంతాల్లో అక్కడక్కడా గుట్టుచప్పుడు కాకుండా కొనసాగుతూనే ఉండటం ఆందోళనకరంగా మారుతోంది. తాజాగా అలాంటి ఘటనే వెలుగులోకి వచ్చింది. ఓ 13 ఏళ్ల బాలికను.. 40 ఏళ్ల వ్యక్తితో పెళ్లి చేశారు. పోలీసుల కళ్లుగప్పి.. ఇళ్లకు తాళాలు వేసి మరీ వివాహం చేశారు. అనంతరం రంగంలోకి దిగిన పోలీసులు.. ఆ వ్యక్తితో పాటు బాలిక తల్లిదండ్రుల ఆట కట్టించారు. కృష్ణా జిల్లా బాపులపాడు మండలంలోని ఈ ఘటన చోటు చేసుకుంది.

40 ఏళ్లు ఓ వ్యక్తికి అప్పటికే ఒకసారి పెళ్లి అయింది. భార్య దూరం కావడంతో ప్రస్తుతం ఒంటరిగా జీవిస్తున్నాడు. ఈ క్రమంలో మరో వివాహం చేసుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టాడు. అయినా ఎక్కడా సంబంధం దొరకలేదు. చివరికి తన మేన కోడల్ని చేసుకునేందుకు సిద్ధమయ్యాడు. అయితే అతడి మేనకోడలి వయసు 13 ఏళ్లే. 8వ తరగతి చదువుతున్న బాలిక చక్కగా పాఠశాలకు వెళ్తోంది. ఆ వ్యక్తి చేసిన ప్రతిపాదనకు.. బాలిక తల్లిదండ్రులు కూడా అనుమతి ఇచ్చారు. దీంతో వీరిద్దరికి పెళ్లి చేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. అయితే ఈ విషయం పోలీసుల దృష్టికి వచ్చింది. దీంతో ఐసీడీఎస్‌ అధికారులు, మహిళా పోలీసులు రంగంలోకి దిగారు.

ఆ వ్యక్తికి ఎకరం పొలం, రెండు సొంతిళ్లు ఉండడంతో.. పెళ్లి తర్వాత ఆస్తిపాస్తులన్నీ తమ కుమార్తె సొంతమవుతాయన్న ఆశతో బాలిక తల్లిదండ్రులు కూడా ఈ పెళ్లికి ఒప్పుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న రెండు కుటుంబాలు.. వారి ఇళ్లకు తాళం వేసి గుట్టుచప్పుడు కాకుండా వేరే ప్రాంతానికి వెళ్లి బాల్య వివాహం చేశాయి. అనంతరం ఏం జరగనట్టు ఇంటికి వచ్చారు. అయితే పోలీసులు వీరిపై నిఘా ఉంచారు. అనంతరం బాలిక ఇంటికి వెళ్లి చూడగా.. ఆమె మెడలో పసుపుతాడు కనిపించింది.

పోలీసులు వార్నింగ్..
బాలిక తల్లిదండ్రులు, ఆ వ్యక్తిని పోలీసులు హెచ్చరించారు. చిన్నారి మెడలోంచి తాళి తీయకుంటే కేసు పెడతామని.. రోజు బాలికను బడికి పంపాలని చెప్పారు. అలా చేయకుంటే తమ శైలిలో బుద్ధి చెబుతామని వార్నింగ్ ఇచ్చారు. భయపడిపోయిన బాలిక తల్లి.. ఆమె మెడలోంచి పసుపుతాడి తీసేసి.. బడికి పంపించింది.

18 ఏళ్లు నిండని బాలిక, లేదంటే 21 ఏళ్లు నిండక ముందే యువకుడు పెళ్లి చేసుకుంటే.. అవి బాల్య వివాహాల కిందకు వస్తాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా అక్కడక్కడా ఇలాంటి బాల్యవివాహాలు జరుగుతున్నాయి. పేదరికం, చదువు లేకపోవడం, ఆడపిల్లల భారం దించుకోవాలనుకోవడం.. వంటి కారణాల వల్ల బాల్య వివాహాలు జరుగుతున్నాయి. బాల్య వివాహాలతో అనర్థాలు తప్పవని.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చట్టాలను రూపొందించాయి. చట్టవిరుద్ధంగా పెళ్లి చేసుకుంటే బాధ్యులకు 2 ఏళ్లు జైలు శిక్ష లేదా రూ. లక్ష జరిమానా విధిస్తారు. కొన్ని సందర్భాల్లో రెండు శిక్షలను ఒకేసారి విధించే అవకాశం కూడా ఉంది.