Ticker

6/recent/ticker-posts

మాట నిలబెట్టుకున్న పవన్ కళ్యాణ్.. ఆ ఆలయానికి 30 ఎకరాలు..


ANDRAPRADESH, ELURU: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట నిలబెట్టుకున్నారు. ఏలూరు జిల్లాలోని ఐఎస్ జగన్నాథపురం లక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ధికి చర్యలు చేపడతామని గత పర్యటనలో పవన్ కళ్యాణ్ మాటిచ్చారు. ఇక ఇచ్చిన మాట ప్రకారం.. ఆలయ అభివృద్ధి కోసం అనేక నిర్ణయాలు తీసుకున్నారు. ఆలయం వద్ద ప్రదక్షిణ మండపం, రహదారి సౌకర్యానికి నిధులు కేటాయించి శంకుస్థాపనలు చేశారు. అలాగే మాట ప్రకారం ఆలయ అభివృద్ధి కోసం ప్రభుత్వం నుంచి 30 ఎకరాల భూమిని కేటాయించేలా పవన్ కళ్యాణ్ కృషి చేశారు.


ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. ఏలూరు జిల్లాలో గతంలో పర్యటించిన పవన్ కళ్యాణ్. ఐ.ఎస్. జగన్నాథపురం లక్ష్మీ నరసింహస్వామి ఆలయం అభివృద్ధికి కృషి చేస్తానని అప్పట్లో మాట ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ ఆలయ అభివృద్ధి కోసం కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆలయం వద్ద ప్రదక్షిణ మండపంతో పాటుగా గ్రామం నుంచి కొండ పైకి వెళ్లేందుకు రోడ్డు నిర్మిస్తామని పవన్ కళ్యాణ్ అప్పట్లో హామీ ఇచ్చారు. ఈ క్రమంలోనే లక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ధి అంశాన్ని ఏపీ కేబినెట్ సమావేశంలో చర్చించారు.

ఆలయ అభివృద్ధికి ప్రత్యేక నిధుల కేటాయించాలని సీఎం చంద్రబాబును కోరారు. అనంతరం జగన్నాథపురం లక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ధి కోసం చంద్రబాబును ఒప్పించి రూ. 8.7 కోట్ల నిధులు మంజూరు చేయించారు. ఆలయానికి అనుబంధంగా అభివృద్ధి పనులు చేపట్టడం కోసం ఆలయానికి 30 ఎకరాల భూమిని కేటాయించేలా చూశారు.

సోమవారం ఐ.ఎస్.జగన్నాథపురంలోపవన్ కళ్యాణ్ పర్యటించారు. ఈ సందర్భంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం రూ. 3.5 కోట్లతో ఆలయ ప్రాంగణంలో నిర్మిస్తున్న ప్రదక్షిణ మండపానికి, అలాగే రూ. 3.7 కోట్లతో ఐ.ఎస్. జగన్నాథపురం నుంచి ఆలయానికి వెళ్లేందుకు నిర్మించనున్న నూతన రహదారి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. వీటితో పాటుగా ఏపీ రోడ్లు, భవనాల శాఖ సహాయంతో పొంగుటూరు, లక్కవరం మధ్య రహదారికి రూ.1.5 కోట్లతో మరమ్మతులు చేయించారు. అలాగే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని అభివృద్ధి చేసే దిశగా.. గతంలో ఇచ్చిన మాట ప్రకారం 30 ఎకరాల భూ కేటాయింపునకు సంబంధించిన పత్రాలను ఆలయ అధికారులకు అందజేశారు.

మరోవైపు ఆలయానికి ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పవన్ కళ్యాణ్‌కు స్థానికులు ధన్యవాదాలు తెలిపారు. అలాగే ఐ.ఎస్. జగన్నాథపురం పర్యటన సందర్భంగా పవన్ కళ్యాణ్‌కు స్థానికుల నుంచి ఘన స్వాగతం లభించింది. ప్రజలు దారి పొడవునా పూల వర్షం కురిపించారు. రాజవరం, యర్రంపేట, గవరవరం, ఐ.ఎస్. జగన్నాథపురంలో మహిళలు మంగళ హారతులతో స్వాగతం పలికారు, పలువురు తమ సమస్యలను పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువచ్చారు. పర్యటన సందర్భంగా పవన్ కళ్యాణ్ పలువురు బాధితుల నుంచి వినతి పత్రాలు స్వీకరించి, వివరాలు తెలుసుకున్నారు. పొలాల్లో పని చేసుకుంటున్న కూలీలను పలకరించి, వారితో ఫొటోలు దిగారు డిప్యూటీ సీఎం.