ANDRAPRADESH: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రాష్ట్ర పంచాయతీరాజ్, అటవీ, పర్యావరణ శాఖ మంత్రిగా ఆయా శాఖలను పర్యవేక్షిస్తున్న విషయం తెలిసిందే. సరిగ్గా ఏడాది కిందట ఆయా శాఖల మంత్రిగా బాధ్యతలు చేపట్టిన పవన్.. ఏరికోరి పంచాయతీరాజ్, అటవీశాఖలను ఎందుకు కోరుకున్నారనేది అప్పట్లో పెద్ద చర్చకు దారితీసింది. ఏడాది తర్వాత పవన్ ప్లాన్ తెలిసి అంతా అవాక్క అవుతున్నారు. డిప్యూటీ సీఎంగా ప్రభుత్వంలో కీలక బాధ్యతల్లో ఉన్న పవన్.. ఎస్సీ, ఎస్టీ వర్గాల్లో తన ముద్ర వేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఇందుకోసం ఏడాదిగా ఆయన చేస్తున్న ప్రయత్నాలను ఉదహరిస్తున్నారు. పవన్ ప్రయత్నాలు ఫలిస్తే ఆయా వర్గాల్లో ఇన్నాళ్లు ప్రతిపక్షం వైసీపీకి ఉన్న బలం ప్రభావితమయ్యే అవకాశాలు ఉన్నాయంటున్నారు.
పల్లె పండుగ, అడవి బాట కార్యక్రమం కింద పవన్ తన మంత్రిత్వ శాఖల పరిధిలో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు. వీటి వల్ల ఏడాదిలోనే స్పష్టమైన మార్పు కనిపిస్తోందని అంటున్నారు. పల్లె పండుగలో ఎక్కడికక్కడ అభివృద్ధి పనులు జరుగుతుండగా, అడవి బాట కార్యక్రమంలో గిరి శిఖర గ్రామాలకు రహదారుల సౌకర్యం కలుగుతోంది. డోలీ మోతలు, కాలిబాటలే తప్ప రోడ్డంటే తెలియని చోట పవన్ ప్రత్యేక శ్రద్ధతో రోడ్డు నిర్మిస్తున్నారని ప్రశంసలు అందుకుంటున్నారు.
పార్వతీపురం మన్యం, అల్లూరి జిల్లాల్లో ప్రత్యేకంగా పర్యటించిన పవన్ అక్కడి గిరిజనులు, ఆదివాసీల సమస్యలసు స్వయంగా తెలుసుకుని వాటి పరిష్కారానికి చర్యలు తీసుకున్నారు. అంతేకాకుండా గిరిజనులకు చెప్పులు ఉచితంగా పంపిణీ చేయడం ద్వారా మనసులను గెలుచుకున్నారని అంటున్నారు. అల్లూరి జిల్లాలో రూ.88 లక్షల వ్యయంతో కిలో మీటరు మేర నిర్మించిన రోడ్డు ఎన్నో గ్రామాల గిరిజనులకు మెరుగైన సౌకర్యం కలిగించింది. దీంతో ఆయా ప్రాంతాల్లో పవన్ ముద్ర స్పష్టంగా కనిపిస్తోందని అంటున్నారు.
వాస్తవానికి ఏజెన్సీకి మిగతా మైదాన ప్రాంతాలకు చాలా వ్యత్యాసం ఉంటుంది. మైదాన ప్రాంతాల్లో ఏ పనిచేసిన ప్రజలను మెప్పించడం చాలా కష్టం. ఒకటికి పదిసార్లు మైదాన ప్రాంతాలపై ఫోకస్ చేయాల్సివుంటుంది. కానీ, ఏజెన్సీ ప్రాంత వాసులతో ఆ సమస్య ఉండదనే విశ్లేషణలు ఉన్నాయి. ఆదివాసీలు, గిరిజనులకు ఏ చిన్న మేలు జరిగినా జీవితాంతం గుర్తుంచుకుంటారని చెబుతారు. ఈ నేపథ్యంలో జనసేనాని పవన్ తన కార్యక్రమాల ద్వారా గిరిజనులకు దగ్గరవుతున్నారు. తమ కష్టాలు తెలుసుకుని వాటి పరిష్కారానికి పవన్ చిత్తశుద్ధితో పనిచేస్తున్నారని గిరిజనులు అభినందిస్తున్నారు. అయితే పవన్ ఇలా ఏజెన్సీపై ప్రత్యేక ఫోకస్ చేయడానికి ఓ వ్యూహాత్మక ప్రణాళిక ఉందని అంటున్నారు.
గతంలో కాంగ్రెస్, ఆ తర్వాత వైసీపీకి కంచుకోటల్లా ఉన్న వైసీపీ కోటలు బద్దలు కొట్టే వ్యూహంతోనే పవన్ ప్రత్యేకంగా ఏజెన్సీ ప్రాంతాలపై ఫోకస్ చేస్తున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. గత ఎన్నికల్లో వైసీపీ గెలిచిన 11 స్థానాల్లో నాలుగు రిజర్వుడు స్థానాలు కావడం విశేషం. ఈ నాలుగింటిలో రెండు ఎస్టీ స్థానాలు ఉన్నాయి. ఇక అంతకుముందు 2019 ఎన్నికల్లో దాదాపు 29 రిజర్వుడు స్థానాలను వైసీపీ గెలుచుకుంది. మొత్తం ఎస్టీ స్థానాల్లో ఒక్కచోట కూడా టీడీపీ గెలవలేదంటే ఆయా ప్రాంతాల్లో వైసీపీ ఎంత బలం ఉందో ఊహించవచ్చు. 2024 ఎన్నికల్లో 90 శాతం స్థానాల్లో కూటమి గెలిచినా, రిజర్వుడు స్థానాల్లో వైసీపీ మళ్లీ పుంజుకోకూడదని డిప్యూటీ సీఎం భావిస్తున్నట్లు చెబుతున్నారు.
రిజర్వుడు స్థానాల్లో పట్టుసాధిస్తే వైసీపీని బలహీనపరచడంతోపాటు ప్రభుత్వంలో తన ప్రభావం మరింత పెరుగుతుందనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. దీంతో డిప్యూటీ సీఎం పవన్ ఏజెన్సీపై ప్రత్యేక శద్ధ వహిస్తున్నారని అంటున్నారు. దీంతో ఆయన చేస్తున్న కార్యక్రమాలు గిరిజనుల మనసును హత్తుకుంటున్నాయని చెబుతున్నారు. అయితే పవన్ ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయో చూడాల్సివుంది.
Social Plugin