ANDRAPRADESH, PITAPURAM: ఏపీలో దారిద్ర రేఖకు దిగువన ఉన్న పేదలకు రేషన్ షాపుల ద్వారా సరుకుల పంపిణీకి దశాబ్దాల చరిత్ర ఉంది. అయితే నాలుగేళ్ల క్రితం వైసీపీ ప్రభుత్వం వీటికి చరమగీతం పాడి వాటిస్ధానంలో రేషన్ వాహనాలను తీసుకొచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా 9 వేలకు పైగా వాహనాలను అందుబాటులోకి తీసుకురావడంతో పాటు వాటి ద్వారా ఇంటింటికీ రేషన్ పంపిణీ చేస్తామని చెప్పింది. అయితే ఇంటింటికీ రేషన్ పంపిణీ సాధ్యం కాలేదు. దీంతో రోడ్డు పక్కనే వాహనాలు ఆపి అక్కడ జనంతో క్యూలు కట్టించేవారు. ఈ వ్యవస్థకు తాజాగా కూటమి ప్రభుత్వం మంగళం పాడింది. వీటి స్ధానంలో తిరిగి రేషన్ షాపుల్ని ఇవాళ ప్రారంభించింది.
రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోనూ రేషన్ షాపుల ద్వారా సరుకుల పంపిణీ కార్యక్రమాన్ని ఇవాళ ఎమ్మెల్యేలు, మంత్రులు ప్రారంభిస్తున్నారు. రేషన్ షాపుల ద్వారా మాత్రమే రేషన్ పంపిణీ చేయాలన్న ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా వీటిని ఇవాళ తిరిగి ప్రారంభించారు. ఈ నిర్ణయంతో రేషన్ లబ్దిదారులకు మేలు కలుగుతుందని ప్రభుత్వం చెబుతోంది. రేషన్ షాపుల వ్యవస్ద తిరిగి ప్రారంభం కావడంతో లబ్దిదారులకు పాత రోజులు గుర్తుకొస్తున్నాయి.
నాలుగున్నరేళ్ల క్రితం 2021 జనవరి 21న అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రేషన్ షాపుల స్ధానంలో రేషన్ వాహనాల్ని ప్రారంభించారు. ఇప్పుడు అవి కాస్తా రద్దు కావడంతో తిరిగి లబ్దిదారులు రేషన్ షాపులకు క్యూ కట్టారు. రేషన్ సరకుల్ని ఇవాళ్టి నుచి 15వ తేదీలోపు ఈ షాపుల్లోనే అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఉదయం, సాయంత్రం వేళల్లో రేషన్ షాపుకు వెళ్లి సరకులు తీసుకునేలా ఏర్పాట్లు చేశారు. అలాగే రేషన్ సరకుల లభ్యత, ఇతర వివరాలను లబ్దిదారులకు అందించేందుకు డీలర్లతో వాట్సాప్ గ్రూపుల్ని ఏర్పాటు చేయించారు. వీటి ద్వారా లబ్దిదారులకు అన్ని వివరాలు అందించనున్నారు.
రేషన్ దుకాణాలతో పారదర్శక ప్రజా పంపిణీ జరుగుతుందని పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. ఇవాళ ఉదయం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నియోజకవర్గం పిఠాపురంలో ఆయన రేషన్ షాపును పునఃప్రారంభించారు. 29,761 రేషన్ షాపుల ద్వారా 1.46 కోట్ల కుటుంబాలకు సరుకుల పంపిణీ చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. రాష్ట్రంలో ఎక్కడ నుంచైనా రేషన్ తీసుకునే వెసులుబాటు కల్పించామన్నారు. 65 ఏళ్లు పైబడిన వృద్ధులు, దివ్యాంగుల ఇళ్ల వద్దకే రేషన్ అందిస్తామన్నారు. రేషన్ దుకాణాల ద్వారా పంపిణీతో ప్రభుత్వానికి రూ.385 కోట్లు ఆదా అవుతుందన్నారు.
Social Plugin