Ticker

6/recent/ticker-posts

మున్సిపల్ ఆస్తులు హాం... ఫట్... మార్ట్ గేజ్ మాయేనా?.... తాకట్టులోని ప్లాట్ లు అమ్మేసారు!


బిల్డర్ తో అధికారులు కుమ్మక్కు..


జంగారెడ్డిగూడెం: పట్టణం అభివృద్ధి చెందుతుందని సంతోష పడాలో రోజు రోజుకు మోసగాళ్ళకు ఆలవాలంగా మారుతుందని భయపడాలో అంతు చిక్కడం లేదని సామాన్యులు వాపోతున్నారు. అక్రమార్జనకు అలవాటు పడిన కొందరు అధికారుల మూలంగా అటు ప్రభుత్వానికి ఇటు నిజాయితీగా పనిచేసే వారికీ చెడ్డ పేరు తప్పటం లేదని సర్వత్రా నిరసన వ్యక్తం అవుతోంది. భవన నిర్మాణం సందర్బంగా నిబంధనల ప్రకారం స్థానిక మున్సిపాలిటీకి మార్ట్ గేజ్ (తనఖా) పెట్టిన రెండు అపార్ట్మెంట్లు(ప్లాట్లు) వేరే వారికి రిజిస్ట్రేషన్ చేసిన ఘరానా బిల్డర్ బిల్డప్ గురించి పట్టణం లో కధలుగా వినవస్తోంది. తనఖాలో వున్న ఆ ప్లాట్లను సబ్ రిజిస్ట్రా ర్ వేరొకరికి ఏ విధంగా రిజిస్ట్రీ చేసారో అంతు చిక్కడం లేదని, ఈ ఉదంతాన్ని గురించి తెలిసిన వారు ఆశ్చర్య పోతున్నారు.

మాయ.. మాయ.. అంతా మాయ..
ఇక్కడి గద్దె ఎస్టేట్స్ లోని విక్టర్ ఫ్రయిడ్  అపార్ట్మెంట్ లోనే ఈ ఫ్రాడ్ జరిగింది. అపార్ట్ మెంట్ నిర్మాణం సందర్బంగా అనుమతులకై ప్లాట్ నెంబర్ 401 నుంచి 404 వరకు మున్సిపాలిటీకి షూర్టీగా తాకట్టు పెట్టారు. అయితే వాటిలో 402,401 ప్లాట్ లు గుట్టుగా రిజిస్ట్రార్ కార్యాలయంలో మెనేజ్ చేసి ఇద్దరికీ అమ్మేసారు. స్థల యాజమాన్యంకు సైతం ఈ సంగతి తెలీదు. వారి సంతకాలు లేకుండా 401ను పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ళ కు చెందిన గొర్తి సతీష్ కు అమ్మేసారు.

402ను జంగారెడ్డిగూడెంనివాసి ఏలూరు నాగ వెంకటఫణి కుమార్ కు రిజిస్టర్ చేశారు. దీనిపై బ్యాంక్ ఆఫ్ ఇండియాలో రూ 30 లక్షలమేర ఋణం కూడా తీసుకోవడం విశేషం. ఈ విషయాలు బయటకు తెలీటం తో బిల్డర్ యావన్మంద జగన్నాధరాజు ఈ జగన్నాటక సూత్రధారని మున్సిపల్కమీషనర్ కె వి రమణ  గుర్తించి ప్లాట్ ల రిజిస్ట్రేషన్ రద్దు చెయ్యాలని సబ్ రిజిస్ట్రార్ ను  కోరుతూ లేఖ రాసారు. ఈనెల ఎనిమిదోవ తేదీన మున్సిపల్ కమీషనర్ తమ తనకాలో ఆస్తి అన్యాక్రాంతం అయిందని వేరే ఇద్దరికి రెండు ప్లాట్లు రిజిస్టర్ చేసారని వాటిని రద్దు చెయ్యాలని లేఖ రాయగా ఇరవై ఆరున దాదాపు మూడు వారాల తరువాత రిజిస్ట్రార్  రిజిస్టర్ చేయించుకున్నసతీష్, ఫణి కుమార్ కు నోటీసులు ఇచ్చారు.

స్థల యాజమాని ఆర్ డి ఓ కు ఫిర్యాదు...
కాగా స్థలం యజమాని  కొల్లూరి సుగుణ జరిగిన మోసం తెలుసుకుని స్థానిక ఆర్ డి ఓ ఎం వి రమణకు "మీకోసం ఫిర్యాదు"లో ఫిర్యాదు చేసారు. అలాగే జిల్లా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్  డి ఐ జి, జిల్లా రిజిస్ట్రార్ కు, కంప్లైంట్ ఇచ్చారు. బోగస్ రిజిస్ట్రేషన్ లను రద్దు పర్చాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

మార్ట్ గేజ్ లో వున్న ఆస్తి ఎలా వేరే వారికి రిజిస్ట్రేషన్ జరిగింది?
మున్సిపాలిటీలో టౌన్ అండ్ కంట్రీ  ప్లాన్ విభాగం వారికి మార్ట్ గేజ్ లో వున్నా ప్లాట్ లు వేరే వారికి ఏ విధానంలో రిజిస్టర్ అయ్యాయి. అసలు సైట్ ఓనర్ సంతకాలు లేకుండా ఏ పద్ధతిలో ఇదంతా జరిగింది? అసలు తనఖా వున్నా ప్రోపర్టీకి బ్యాంక్ లోన్ ఎలా సాధ్యం? అనే ప్రశ్నలు తలెత్తు తున్నాయి. అంతే కాకుండా తమ మార్ట్ గేజ్ లో గల ఆస్తి వేరొకరికి  అమ్మేసిన వారి మీద హక్కులు లేని ప్రోపర్టీ గుడ్డిగా రిజిస్టర్ చేసిన వారిమీద మునిసిపల్ అధికారులు ఎందుకు పోలీసులకు ఫిర్యాదు ఇవ్వలేదనే అనుమానాలు అందరినీ వెంటాడుతున్నాయి. లో..గుట్టు పేరుమాళ్ల కేఎరుక..