ANDRAPRADESH, AMARAVATHI, KADAPA: పార్టీ అధికారంలో ఉండగా, రాయలసీమలోని నాలుగు ఉమ్మడి జిల్లాల్లో పెద్దిరెడ్డి హవా నడిచేది. అక్కడ ఆయనే సీఎం అన్నట్లు ఉండేదంటారు By: SRTV NEWS వైసీపీలో ప్రధాన నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం మొత్తం ఒకేసారి చిక్కుల్లో పడిందా? వైసీపీ అధినేత జగన్ తర్వాత పార్టీలో అంత పవర్ ఫుల్ లీడరుగా పెద్దిరెడ్డికి గుర్తింపు ఉంది. పార్టీ అధికారంలో ఉండగా, రాయలసీమలోని నాలుగు ఉమ్మడి జిల్లాల్లో పెద్దిరెడ్డి హవా నడిచేది.
అక్కడ ఆయనే సీఎం అన్నట్లు ఉండేదంటారు. అయితే అప్పట్లో అంత పవర్ చూపిన పెద్దిరెడ్డికి ఇప్పుడు అదే సమస్యగా మారిందని అంటున్నారు. సీనియర్ నేత పెద్దిరెడ్డితోపాటు ఆయన కుమారుడు ఎంపీ మిథున్ రెడ్డి, సోదరుడు ద్వారకానాథరెడ్డి, ఇతర కుటుంబ సభ్యులను ఒకేసారి జైలుకు పంపాలని ప్రభుత్వం వ్యూహం రచించినట్లు ప్రచారం జరుగుతోంది.
వైసీపీలో కీలక నేత పెద్దిరెడ్డి కుటుంబాన్ని చిక్కుల్లో పడేయడం ద్వారా రాయలసీమలో రాజకీయంగా పట్టుసాధించాలని కూటమి ప్రభుత్వం వ్యూహరచన చేస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అందుకే పెద్దిరెడ్డి కుటుంబంలో ప్రతిఒక్కరిపై ఏదో ఒక కేసు నమోదు చేసేలా పావులు కదుపుతున్నట్లు చెబుతున్నారు. ఇప్పటికే పెద్దిరెడ్డి, ఆయన కుమారుడు మిథున్ రెడ్డి, సోదరుడు ద్వారాకానాథరెడ్డిపై కేసులు నమోదయ్యాయి. కుటుంబంలోని కొందరు మహిళలను కూడా నిందితుల జాబితాలో చేర్చారంటున్నారు. దీంతో ఏ క్షణమైనా వారి అరెస్టు జరగొచ్చనే టాక్ వినిపిస్తుంది. అంతేకాకుండా పెద్దిరెడ్డి కుటుంబంపై కేసులను ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ పర్యవేక్షిస్తున్నారని అంటున్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు, మాజీ మంత్రి పెద్దిరెడ్డిది ఒకే జిల్లా. చంద్రబాబుకు దీటుగా రాజకీయాలు చేస్తున్న పెద్దిరెడ్డి గత ప్రభుత్వంలో చాలా కీలకంగా పనిచేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన బావమరిది బాలక్రిష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం, హిందుపురం నియోజకవర్గాల్లో వారికి ఓటమి రుచి చూపించాలని ఉవ్విళ్లురూరారు. అయితే మారిన రాజకీయ పరిస్థితుల్లో పెద్దిరెడ్డి తన సొంత నియోజకవర్గంలో అడుగుపెట్టలేని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. పెద్దిరెడ్డి పుంగనూరు ఎమ్మెల్యేగా ఉండగా, ఆయన సోదరుడు తంబళ్లపల్లె ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. వీరిద్దరు ప్రస్తుతం తమ నియోజకవర్గాలకు ఏడాదిగా దూరంగా ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. మరోవైపు పెద్దిరెడ్డి, ఆయన సోదరుడు ఇతర కుటుంబ సభ్యులపై అటవీ భూముల ఆక్రమణ కేసు నమోదయ్యాయి. పెద్దిరెడ్డి కుమారుడు ఎంపీ మిథున్ రెడ్డిపై లిక్కర్ స్కాం కత్తి వేలాడుతోంది. ఈ కేసులో ఆయనకు అరెస్టు నుంచి సుప్రీంకోర్టు రక్షణ కల్పిస్తోంది.
ప్రభుత్వం సుప్రీంలో న్యాయపోరాటం ద్వారా మిథున్ రెడ్డి అరెస్టుకు పావులు కదుపుతోందని అంటున్నారు. ఈ కేసును ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యవేక్షిస్తున్నట్లు చెబుతున్నారు. లిక్కర్ స్కాంలో వైసీపీలో బిగ్ బాస్ ప్రమేయం ఉందనే అనుమానంతో ప్రభుత్వాధినేతే స్వయంగా రంగంలోకి దిగి రోజూ కేసు దర్యాప్తు సమాచారం తెలుసుకుంటున్నారని అంటున్నారు. దీంతో మిథున్ రెడ్డికి ఎక్కువ కాలం రక్షణ ఉండకపోవచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు డిప్యూటీ సీఎం పవన్ ప్రత్యక్ష పర్యవేక్షణతో పెద్దిరెడ్డిపై అటవీ శాఖ కేసు నమోదు చేసిందని అంటున్నారు. పోలీసు కేసులు కన్నా అటవీ కేసులు పకడ్బందీగా ఉంటాయనే ప్రచారంతో సీనియర్ నేత పెద్దిరెడ్డికి ఇక్కట్లు తప్పవని టాక్ వినిపిస్తోంది.
ఇలా మొత్తం పెద్దిరెడ్డి కుటుంబాన్ని చిక్కులు పడేసి రాజకీయంగా రాయలసీమలో పట్టు పెంచుకోవాలని టీడీపీ కూటమి సన్నాహాలు చేస్తోందంటున్నారు. ఒకప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబును రాజకీయంగా దెబ్బతీయాలని చూసి కుప్పం రాజకీయాల్లో వేలు పెట్టిన పెద్దిరెడ్డికి చంద్రబాబు రిటర్న్ గిఫ్ట్ తో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారని అంటున్నారు. మరోవైపు పెద్దిరెడ్డి కుటుంబంపై కేసులను మంత్రి నారా లోకేశ్ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని అంటున్నారు. తన యువగళం పాదయాత్ర ప్రారంభంలో రాయలసీమలో అనేక సమస్యలు సృష్టించిన పెద్దిరెడ్డిని తేలిగ్గా వదలొద్దని లోకేశ్ భావిస్తున్నారని అంటున్నారు. దీంతో పెద్దిరెడ్డి కుటుంబం మొత్తం అరెస్టు భయంతో గడపాల్సివస్తోందని అంటున్నారు.
Social Plugin