Ticker

6/recent/ticker-posts

లోకేశ్ కు లైన్ క్లియర్ చేస్తున్న బాబు.. ఢిల్లీ పర్యటన వెనుక భారీ వ్యూహం!


ANDRAPRADESH, AMARAVATHI: మరో పది రోజుల్లో జరిగే మహానాడులో కీలక బాధ్యతలు తీసుకుంటారని టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆయన ప్రధాని మోదీతోపాటు కేంద్రంలోని కీలక నేతలతో భేటీ అవుతున్నారని అంటున్నారు. By:  SRTV NEWS టీడీపీ యువనేత నారా లోకేశ్ పట్టాభిషేకానికి ముఖ్యమంత్రి చంద్రబాబు లైన్ క్లియర్ చేస్తున్నారా? ప్రధాని నరేంద్ర మోదీని కుటుంబ సమేతంగా లోకేశ్ కలవాడానికి ప్రధాన కారణం ఉందా? ప్రధాని మోదీయే రమ్మనమని లోకేశ్ ను ఆహ్వానించారని ప్రచారం చేస్తున్నా, ప్రధానితో భేటీ వెనుక చాలా పెద్ద కారణమే ఉందంటూ జరుగుతున్న ప్రచారం ఆసక్తి రేపుతోంది. ప్రస్తుతం టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్న లోకేశ్.. మరో పది రోజుల్లో జరిగే మహానాడులో కీలక బాధ్యతలు తీసుకుంటారని టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆయన ప్రధాని మోదీతోపాటు కేంద్రంలోని కీలక నేతలతో భేటీ అవుతున్నారని అంటున్నారు. 


ప్రస్తుతం మానవ వనరులు, ఐటీ మంత్రిగా ఉన్న నారా లోకేశ్ ప్రభుత్వంలో పూర్తి పట్టు సాధించినట్లేనని చెబుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు డైరెక్షన్ లో పాలనపై అవగాహన పెంచుకుంటున్న లోకేశ్ పార్టీకి భావినేతగా అందరి ఆమోదం పొందినట్లేనంటున్నారు. ప్రస్తుతం టీడీపీలో ఏం జరగాలన్నా, నారా లోకేశ్ అనుమతి ఉండాల్సిందేనని చెబుతున్నారు. ప్రభుత్వ నిర్ణయాల్లోనూ లోకేశ్ ముద్ర స్పష్టంగా కనిపిస్తోందని అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇటు రాజకీయంగా, అటు ప్రభుత్వ పరంగా లోకేశ్ కు సంపూర్ణ అవగాహన ఉండాలని భావిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఓ అడుగు వెనక్కి తగ్గి, లోకేశ్ తో ముందడు వేయించాలని భావిస్తున్నారని అంటున్నారు. 

లోకేశ్ ను ప్రధాన నేతగా తీర్చిదిద్దడంలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు పూర్తిగా సమీక్షలు, కొన్ని అధికార కార్యక్రమాలకు మాత్రమే పరిమితమవుతున్నట్లు చెబుతున్నారు. ఇక రాజకీయ నిర్ణయాలు, ఇతర పార్టీలతో స్నేహ సంబంధాలు వంటివి పూర్తిగా లోకేశ్ కే అప్పగించినట్లు చెబుతున్నారు. రాష్ట్రంలో బీజేపీ, జనసేనతో సమన్వయం విషయంలోకానీ, కేంద్రంలో బీజేపీ పెద్దలతో కానీ లోకేశే మంత్రాంగం నడుపుతున్నట్లు ఇటీవల పరిణామాలు తెలియజేస్తున్నాయని అంటున్నారు. 

సాధారణంగా ముఖ్యమంత్రి మాత్రమే ఢిల్లీ వెళ్లి కేంద్ర మంత్రులు, ప్రధానితో భేటీ అవుతుంటారు. ఏదైనా రాష్ట్ర మంత్రి ఢిల్లీ పర్యటనకు వెళితే తమ శాఖ పరిధిలోని అధికారిక కార్యక్రమాలకు మాత్రమే పరిమితమవుతారు. కానీ, రాష్ట్ర మంత్రి హోదాలో ఢిల్లీకి వస్తున్న లోకేశ్ ఏపీ ప్రభుత్వం తరఫున కేంద్రంలో అన్ని శాఖల మంత్రులతోనూ సమావేశమవుతున్నారు. తన రాష్ట్రానికి నిధులు సేకరణతోపాటు ప్రాజెక్టులకు అనుమతి సాధించేలా అడుగులు వేస్తున్నారు. ఇది అధికారిక పనే అయినప్పటికీ అంతర్లీనంగా ఆయా నేతలతో బంధాలు గట్టి చేసుకోవడమనే ప్రధాన టాస్క్ ఉందని అంటున్నారు. 

రాజకీయాల్లో పదికాలాలు పాటు కొనసాగాలంటే సరైన వ్యూహరచన నైపుణ్యం అవసరమని ముఖ్యమంత్రి చంద్రబాబు భావిస్తున్నారట. అందుకే తన కుమారుడు అన్నిరకాలుగా రాటు దేలాలని కేంద్రంలో పేరుమోసిన నేతల నుంచి రాజకీయ ఎత్తులు నేర్చుకోవాలని సలహాలిస్తున్నారని అంటున్నారు. చంద్రబాబు సూచనలతో దేశ రాజకీయాల్లో డక్కామొక్కీలు తెలిసిన నేతలు అందరితోనూ లోకేశ్ పరిచయాలు పెంచుకుంటున్నట్లు చెబుతున్నారు. ఇవి ఇప్పటికిప్పుడు అవసరమవకపోయినా, భవిష్యత్తులో మేలు చేస్తాయంటున్నారు. మొత్తానికి సమీప భవిష్యత్తులో లోకేశ్ కు పెద్ద బాధ్యతలు అప్పగించడానికి ఇప్పటి నుంచే ముఖ్యమంత్రి చంద్రబాబు లైన్ క్లియర్ చేస్తున్నట్టు చెప్పుకుంటున్నారు.