ఇంటర్నెట్ డెస్క్: దేశవ్యాప్తంగా ఈ నెల 3న నిర్వహించిన నీట్ (NEET) 2026 పరీక్షను రద్దు చేస్తున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ప్రకటించింది. రాజస్థాన్లో పరీక్ష ప్రశ్నపత్రం లీక్ అయినట్లు వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. త్వరలో కొత్త షెడ్యూల్ ప్రకటిస్తామని NTA తెలిపింది. పేపర్ లీక్ కేసును దర్యాప్తు చేయడానికి సీబీఐ (సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్)కి అప్పగించింది.
విద్యార్థులు ఇప్పటికే NEET 2026 కోసం చేసిన రిజిస్ట్రేషన్ అలాగే కొనసాగుతుందని NTA తెలిపింది. ఎంపిక చేసిన పరీక్ష కేంద్రాల్లోనే మళ్లీ పరీక్ష నిర్వహించే అవకాశం ఉందని వెల్లడించింది. మళ్లీ కొత్తగా దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదని, అదనంగా ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం కూడా లేదని స్పష్టం చేసింది.
కొత్త పరీక్ష తేదీలు, అడ్మిట్ కార్డ్ వివరాలు అన్నీ కేవలం NTA అధికారిక వెబ్సైట్ ద్వారానే ప్రకటిస్తామని పేర్కొంది. సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు వార్తలు, ఫేక్ మెసేజ్లను నమ్మవద్దని హెచ్చరించింది. విద్యార్థులు, తల్లిదండ్రులు కేవలం అధికారిక సమాచారాన్నే అనుసరించాలని NTA సూచించింది.

