Ticker

6/recent/ticker-posts

ఏపీలో దారుణ ఘటన.. తల్లిని ఇంట్లో బంధించి సజీవ దహనం చేసిన కుమారుడు


ఆంధ్రప్రదేశ్, ప్రకాశం జిల్లా: ఏపీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. నవ మాసాలు మోసి, కనిపెంచిన తల్లి ప్రాణాలను కొడుకు బలిగొన్నాడు. మద్యం మత్తులో తల్లిని నివాసంలో బంధించి, తాళం వేసి పెట్రోల్ పోసి నిప్పంటించాడు. దీంతో ఆ మంటల్లో తల్లి సజీవదహనమైంది. ఈ దారుణ ఘటన ఏపీలోని ప్రకాశం జిల్లా ఒంగోలు పరిధిలోని గద్దలగుంట్లలో చోటు చేసుకుంది.


అచ్చకాల వెంకటరమణమ్మ ( సుమారు 70), కిషోర్ ( సుమారు 40) తల్లికుమారుడు. మూడు నెలల క్రితం తల్లితోసహా గద్దలగుంట్లకు వచ్చి కిషోర్ ఓ ఇంటిని అద్దెకు తీసుకొని అందులో నివాసం ఉంటున్నాడు. మద్యానికి బానిసైన కిషోర్.. నిత్యం తాగివస్తూ ఇంట్లో గొడవకు దిగేవాడు. అయితే, తాజాగా మద్యం మత్తులో తల్లిని నివాసంలో బంధించి, ఇంటికి తాళం వేసి నిప్పంటించాడు. మంటల్లో తల్లి వెంకటరమణమ్మ సజీవదహనమైంది. ఆమె శరీరం పూర్తిగా కాలిపోయి బూడిదైంది. కాలు, చెయ్యి మాత్రమే ఆనవాళ్లుగా మిగిలాయి.

దారుణ ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటీన ఘటన స్థలికి వెళ్లారు. అప్పటికే నిందితుడు కిషోర్ అక్కడి నుంచి పరారయ్యాడు. పోలీసులు ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.