Ticker

6/recent/ticker-posts

పవన్ కు పెరిగిన ప్రాధాన్యం.. ప్రధాని మోదీతో కలిసి భోజనం


INDIA NEWS: దేశ రాజధాని ఢిల్లీలో ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రాధాన్యం ఒక్కసారిగా పెరిగింది. BY; SRTV NEWS ఎన్నికలకు ముందు ఓ చిన్న పార్టీకి లీడరుగా పవన్ ను భావించేవారు. కానీ, ఇప్పుడు ఆయనలో శక్తి జాతీయస్థాయి నాయకులు అందరికీ తెలిసింది అంటున్నారు. ముఖ్యంగా ప్రధాని మోదీ జనసేనాని పవన్ కు అత్యంత ప్రాధాన్యమిస్తున్నారని టాక్ నడుస్తోంది. దీనికి తగ్గట్టే ఈ రోజు ఢిల్లీలో జరిగిన ఎన్డీఏ పాలిత రాష్ట్రాల సీఎం, డిప్యూటీ సీఎంల సమావేశంలో ఓ అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది.


ఎన్డీఏ ముఖ్యమంత్రుల సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఏపీ తరఫున హాజరైన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రైవేటు కార్యక్రమంలో ఉండటంతో రాష్ట్రం తరఫున పవన్ హాజరయ్యారు. ఇక సమావేశంలో పవన్ కు ప్రధాని అత్యంత ప్రాధాన్యమిచ్చారు. తనతో కలిసి భోజనానికి ఆహ్వానించారు. దేశంలో మొత్తం 20 రాష్ట్రాల్లో ఎన్డీఏ పక్షాలు ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. అయితే తనతో కలిసి భోజనం చేసేందుకు పవన్ తోపాటు, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రులు ఏకనాథ్ శిండే, అజిత్ పవార్ లను ప్రధాని ఆహ్వానించారు.

ఇక ప్రధానితో కలిసి భోజనం చేయడాన్ని ఉప ముఖ్యమంత్రి పవన్ తన ఎక్స్ ఖాతాలో వెల్లడించారు. ‘‘ఈ రోజు నిజమైన హీరోతో కలిసి భోజనం చేశా’’ అంటూ ఆనందం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీని నిజమైన హీరో అనడంతోపాటు దేశం పట్ల ఆయనకు ఉన్న అంకితభావం, ప్రేమ, నిబద్ధత నిత్యం ప్రేరణ కలిగిస్తాయని రాసుకొచ్చారు.

ప్రధానితో పవన్ కల్యాణ్ కలిసి భోజనం చేస్తున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎన్డీఏ ప్రభుత్వ ఏర్పడటంలో పవన్ పాత్ర కీలకంగా భావిస్తుండటంతో ఆయన ప్రాధాన్యం పెరిగిందని అంటున్నారు. దేశంలో ఎందరో ప్రముఖ నేతలు ఉన్నా పవన్ విషయంలో ప్రధాని చాలా శ్రద్ధ చూపుతున్నారని అంటున్నారు.