Ticker

6/recent/ticker-posts

లిక్కర్ స్కామ్.. మరో ఇద్దరి అరెస్ట్..


అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన లిక్కర్ స్కామ్‌ కేసు కీలక మలుపు తిరిగింది. BY: SRTV NEWS ఈ కేసులో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ధనుంజయ్ రెడ్డితోపాటు మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డిని సిట్ అధికారులు శుక్రవారం అరెస్ట్ చేశారు. వీరిద్దరినీ అరెస్ట్ చేసినట్లు సిట్ అధికారులు అధికారింగా ప్రకటించారు. వరుసగా మూడ్రోజులపాటు వీరిని విచారించిన సిట్ అధికారులు తాజాగా అరెస్ట్ చేశారు. అయితే మందస్తు బెయిల్ కోసం నిందితులిద్దరూ సుప్రీంకోర్టును ఆశ్రయించి పిటిషన్ దాఖలు చేశారు. వీరి పిటిషన్‌ను సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది. దీంతో వారిద్దరినీ సిట్ అధికారులు అరెస్ట్ చేశారు.


జగన్ ప్రభుత్వ హయాంలో నాసిరకం మద్యాన్ని విక్రయించారు. అలాగే మద్యం కొనుగోళ్లన్నీ డిజిటల్ చెల్లింపులు కాకుండా.. నేరుగా నగదు రూపంలో లావాదేవీలు జరిగాయి. ఈ మొత్తం వ్యవహారంపై పెద్దఎత్తున ఆరోపణలు వెల్లువెత్తాయి. అంతేకాకుండా నాసిరకం మద్యం కారణంగా వేలాది మంది మరణించారు. దీంతో ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కూటమికి ఓటర్ పట్టం కట్టాడు. ఈ మేరకు చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం కొలువు తీరింది.

అనంతరం గత ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్న అవినీతి అక్రమాలను వెలికి తీయడంపై దృష్టి పెట్టింది కూటమి సర్కార్. అందులో భాగంగా తిరుమల శ్రీవారి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగంపై సిట్ దర్యాప్తునకు ఆదేశించారు. అలాగే మద్యం వ్యవహారంపైనా సిట్ దర్యాప్తు జరుగుతోంది.

ఈ దర్యాప్తులో భాగంగా ఇప్పటికే పలువురు వైసీపీకి చెందిన వారిని సిట్ అరెస్ట్ చేసింది. ఈ మద్యం కుంభకోణం వ్యవహారంలో పాత్రదారి, సూత్రదారైన రాజ్ కసిరెడ్డి.. గోవా నుంచి హైదరాబాద్‌కు మారు పేరుతో రావడంతో అతడిని శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

అదీకాక.. ఈ మద్యం కుంభకోణంలో కర్త, కర్మ, క్రియ అంతా రాజ్ కసిరెడ్డి అని వైసీపీ మాజీ నేత, మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి మీడియా ఎదుట ప్రకటించిన సంగతి తెలిసిందే. అలా కసిరెడ్డితోపాటు ఈ కేసులో పలువురు అరెస్టులు కొనసాగుతున్నాయి. ఈ కేసులో మరిన్ని అరెస్టులు తప్పవనే చర్చ జరుగుతోంది.