Ticker

6/recent/ticker-posts

నమ్మి బాధ్యతలు ఇస్తే షాకిచ్చాడు.. పెట్రోల్ బంక్ నుంచి ఖైదీ పరార్..


చిత్తూరు జిల్లా పలమనేరు, AUG, 11: జైళ్ల శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న పెట్రోల్ బంక్ నుంచి ఓ జీవిత ఖైదీ తప్పించుకుపోవడం తీవ్ర కలకలం రేపింది. హత్య కేసులో శిక్ష అనుభవిస్తున్న సూరి (39) అనే ఖైదీ ఆదివారం ఉదయం అధికారుల కన్నుకప్పి పరారయ్యాడు. ఈ సంచలన ఘటనతో అటు జైళ్ల శాఖ అధికారులతో పాటు ఇటు స్థానిక పోలీస్ యంత్రాంగం ఒక్కసారిగా అప్రమత్తమైంది.


నిందితుడు సూరి గతంలో జరిగిన ఒక హత్య కేసులో దోషిగా తేలడంతో న్యాయస్థానం అతనికి జీవిత ఖైదు శిక్ష విధించింది. ఈ క్రమంలో అతను కడప సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. అయితే.. జైలులో అతని సత్ప్రవర్తనను పరిగణనలోకి తీసుకున్న జైళ్ల శాఖ అధికారులు, పునరావాస చర్యల్లో భాగంగా పలమనేరులోని జైళ్ల శాఖ పెట్రోల్ బంక్ నిర్వహణ బాధ్యతల కోసం అతడిని అక్కడికి తరలించారు. ఖైదీలలో పరివర్తన తీసుకురావడానికి జైళ్ల శాఖ నడుపుతున్న పెట్రోల్ బంకుల్లో మంచి ప్రవర్తన ఉన్న ఖైదీలకు పనులు కేటాయిస్తుంటారు. అదే నమ్మకంతో సూరిని కూడా అక్కడ పనిలో పెట్టారు.

అయితే, ఆదివారం ఉదయం విధుల నిర్వహణలో ఉన్న సమయంలో సూరి చాకచక్యంగా అక్కడ నుంచి తప్పించుకున్నాడు. అతడు కనిపించకపోవడాన్ని గమనించిన తోటి ఖైదీలు వెంటనే స్పందించి జైళ్ల శాఖ ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన జైళ్ల శాఖ సూపరింటెండెంట్ యూనిస్ ఘటనపై స్థానిక పోలీసులకు అధికారికంగా ఫిర్యాదు చేశారు.

సూపరింటెండెంట్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి తీవ్రంగా దర్యాప్తు చేస్తున్నారు. పరారైన ఖైదీ సూరి పట్టుబడటానికి ప్రత్యేక బృందాలను రంగంలోకి దించి విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. ప్రధాన రహదారులు, బస్సు స్టాండ్లు, రైల్వే స్టేషన్లతో పాటు సరిహద్దు ప్రాంతాల్లోనూ నిఘా ఏర్పాటు చేశారు. నమ్మకంతో బాధ్యతలు అప్పగిస్తే అధికారులకే షాక్ ఇస్తూ పరారవ్వడంపై స్థానికంగా తీవ్ర చర్చ నడుస్తోంది.