ఆంధ్రప్రదేశ్, అమరావతి, AUG, 11: రాష్ట్రంలోని మారుమూల గ్రామాలకు రహదారి సౌకర్యం కల్పించే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధాన మంత్రి గ్రామ సడక్ యోజన కింద రూ.422.10 కోట్లతో మరో 158 ఆవాసాలకు తొలిసారి రోడ్డు సౌకర్యం కల్పించనున్నారు. ఈ పనులను పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగం ఆధ్వర్యంలో చేపట్టనున్నారు. ఈ ప్రాజెక్టులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 347 కిలోమీటర్ల మేర 146 రోడ్లు, 19 వంతెనలు నిర్మించనున్నారు.
రహదారి సౌకర్యం లేని ఆవాసాలను గుర్తించి పనులకు అవసరమైన అంచనాలను అధికారులు రూపొందించారు. అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, అనంతపురం, శ్రీ సత్యసాయి, కర్నూలు, కడప, తిరుపతి, నెల్లూరు, ప్రకాశం, పల్నాడు, ఎన్టీఆర్, ఏలూరు, పోలవరం, విజయనగరం, శ్రీకాకుళం తదితర జిల్లాల్లో ఈ రహదారి పనులు చేపట్టనున్నారు.
ఐదేళ్ల నిర్వహణకు అదనంగా రూ.24.47 కోట్లు
నిర్మాణంతో పాటు రోడ్ల నిర్వహణకు కూడా ప్రభుత్వం ప్రాధాన్యం ఇచ్చింది. రహదారులు, వంతెనల నిర్వహణ కోసం ఐదేళ్ల కాలానికి అదనంగా రూ.24.47 కోట్ల నిధులను విడుదల చేశారు. నిర్మించిన రహదారులు దీర్ఘకాలం ప్రజలకు ఉపయోగపడేలా నిర్వహణ చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే, మారుమూల గ్రామాల్లో నిర్మించే రోడ్లు, వంతెనల విషయంలో అత్యున్నత నాణ్యతా ప్రమాణాలను పాటించాలని డిప్యూటీ సీఎం, పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కల్యాణ్ అధికారులను ఆదేశించారు.
తాము నిర్మించే రోడ్లు పది కాలాల పాటు ప్రజలకు ఉపయోగపడేలా ఉండాలని స్పష్టం చేశారు. రహదారి సౌకర్యం లేని గ్రామాలకు మెరుగైన రవాణా సదుపాయాన్ని కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని పవన్ కల్యాణ్ తెలిపారు. రోడ్లు, వంతెనల నిర్మాణం పూర్తయితే మారుమూల గ్రామాలకు బాహ్య ప్రపంచంతో మెరుగైన అనుసంధానం ఏర్పడుతుందని చెప్పారు.
విద్య, వైద్యం, మార్కెటింగ్కు మెరుగైన అవకాశాలు
రహదారి సౌకర్యం అందుబాటులోకి రావడం వల్ల గ్రామీణ ప్రజలకు అనేక ప్రయోజనాలు కలగనున్నాయని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ముఖ్యంగా విద్య, వైద్యం, మార్కెటింగ్ సదుపాయాలు మరింత అందుబాటులోకి వస్తాయని తెలిపారు. రైతులు తమ ఉత్పత్తులను మార్కెట్లకు సులభంగా తరలించుకోవడంతో పాటు అత్యవసర వైద్య సేవలు కూడా వేగంగా పొందే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.
కేంద్ర సహకారంతో ప్రాజెక్టు
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో, కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సహకారంతో రాష్ట్రంలోని మరో 158 ఆవాసాలకు తొలిసారి రోడ్డు సౌకర్యం కల్పించడం ఆనందంగా ఉందని పవన్ కల్యాణ్ అన్నారు. మారుమూల పల్లెలను ప్రధాన రహదారులతో అనుసంధానం చేయడం ద్వారా గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి మరింత ఊతం లభిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. రోడ్లు, వంతెనల నిర్మాణంలో నాణ్యతతో పాటు నిర్ణీత సమయంలో పనులను పూర్తి చేయడంపై అధికారులు దృష్టి పెట్టనున్నారు.

