INDIA NEWS, JUL, 22: నిరాహార దీక్ష చేస్తున్న సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్చుక్ దీక్ష విరమిస్తున్నట్లు ప్రకటించారు. అయితే, తన కేంద్ర ప్రభుత్వానికి కొన్ని షరతులు విధించారు. ఆస్పత్రిలో తనను పరామర్శించి నిరాహారదీక్ష విరమించాలని కోరిన కేంద్రమంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్లకు వాంగ్చుక్ లేఖ రాశారు. చర్చల సందర్భంగా తన డిమాండ్లలో కొన్నింటిని సానుకూలంగా పరిశీలిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని ఆయన చెప్పారు.
పేపర్ లీక్ తర్వాత ఆత్మహత్యలు చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు తగిన పరిహారం ఇవ్వాలని , విద్యాశాఖ మంత్రి రాజీనామాను కూడా పరిగణలోకి తీసుకోవాలని, జవాబుదారీతనాన్ని నిర్ధారించడానికి పార్లమెంట్లో చర్చ జరగాలని వాంగ్చుక్ తన లేఖలో డిమాండ్ చేశారు. చలో పార్లమెంట్ మార్చ్పై పోలీసుల బలప్రయోగం జరిగినప్పటికీ ప్రదర్శన అత్యంత శాంతియుతంగా కొనసాగిందని ఆయన అన్నారు. నిరసనకారుల సహనం, నిబద్ధత దేశం, ప్రపంచం చూసిందని అన్నారు. ప్రదర్శనలో పాల్గొన్న వారిపై చట్టబద్ధమైన కేసులు, వేధింపులు, ప్రతీకార చర్యలు ప్రజాస్వామ్య సంస్థలపై విశ్వాసాన్ని మరింత దెబ్బతీస్తాయని వాంగ్చుక్ తన లేఖలో పేర్కొన్నారు.
కేంద్రమంత్రుల సమావేశం తర్వాత, వివిధ రాజకీయ పార్టీలకు చెందిన 65 మంది ఎంపీలు కూడా తన నిరాహార దీక్షను విరమించాలని కోరతూ లేఖ రాసినట్లు వాంగ్చుక్ తెలిపారు. ఈ ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థులు, యువతపై ఎలాంటి చర్యలు తీసుకోమని, కేసులు పెట్టబోమని ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీని కోరారు. ప్రభుత్వం నుంచి ఈ హామీలు లభిస్తే నిరాహారదీక్ష విరమిస్తానని చెప్పారు. హామీ లభించకపోతే నిరవధికంగా నిరాహారదీక్ష కొనసాగిస్తానని హెచ్చరించారు.

