INDIA NEWS, MAY, 10: భారత అణ్వాస్త్ర సామర్థ్యం మరింత బలపడింది. మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటెడ్ రీ-ఎంట్రీ వెహికల్ (MIRV) వ్యవస్థతో కూడిన అడ్వాన్స్డ్ అగ్ని క్షిపణిని భారత రక్షణ పరిశోధన సంస్థ DRDO విజయవంతంగా పరీక్షించింది. ఈ టెక్నాలజీ ద్వారా క్షిపణి ఒకేసారి అనేక లక్ష్యాలపై వేర్వేరు ప్రాంతాల్లో ఖచ్చితమైన దాడులు చేయగలదు. శుక్రవారం ఒడిశాలోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఐలాండ్ నుంచి ఈ క్షిపణిని ప్రయోగించారు. ఖచ్చితమైన లక్ష్యాలపై దాడులు చేసినట్లు డీఆర్డీవో అధికారులు వెల్లడించారు. మిస్సైల్ మల్టిపుల్ పేలోడ్లతో ప్రయాణించి, నిర్దేశిత లక్ష్యాలను ఛేదించినట్లు తెలిపారు.
అగ్ని మిస్సైల్ సక్సెస్పై రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ హర్షం వ్యక్తం చేశారు. భారత్ సైన్యం, దేశీయ రక్షణ పరిశ్రమల్ని కొనియాడారు. ఈ పరీక్షతో భారత భద్రతా సామర్థ్యాలు మరింత బలోపేతమైనట్లు చెప్పారు. ప్రయోగ సమయంలో భూమిపై ఉన్న ట్రాకింగ్ వ్యవస్థలు క్షిపణి మార్గాన్ని నిరంతరం పర్యవేక్షించాయి. క్షిపణి నింగికెగిసినప్పటి నుంచి లక్ష్యాలను ఛేదించే వరకు డేటాను సేకరించినట్లు డీఆర్డీఓ తెలిపింది.
మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటెడ్ రీ-ఎంట్రీ వెహికల్ (MIRV) వ్యవస్థ అనేది ఒకే క్షిపణి ద్వారా వేర్వేరు ప్రాంతాల్లోని బహుళ లక్ష్యాలపై దాడులు చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. దీని ద్వారా శత్రు దేశాల క్షిపణి రక్షణ వ్యవస్థను ఛేదించడం మరింత సులువు అవుతుంది. ప్రపంచంలో కొద్ది దేశాల వద్ద మాత్రమే ఈ టెక్నాలజీ ఉంది. ఇదిలా ఉంటే, గురువారం డీఆర్డీఓ, భారత వైమానిక దళం టాక్టికల్ అడ్వాన్స్డ్ రేంజ్ ఆగ్మెంటేషన్ (TARA) ఆయుధ వ్యవస్థను కూడా విజయవంతంగా పరీక్షించాయి. ఇది సాధారణ ఆయుధాలను అత్యంత ఖచ్చితత్వంతో దాడులు చేసే సామర్థ్యం కలిగే ప్రెసిషన్ గైడెడ్ గ్లైడ్ వెపన్లుగా మార్చే ఒక స్వదేశీ సాంకేతికత.

