ANDRAPRADESH: మహాపాపం చేశావ్.. జగన్!- అంటూ టీడీపీ నేత, మంత్రి నారా లోకేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం శాసన మండలిలో వైసీపీ సభ్యులు వ్యవహరించిన తీరును ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. దీని వెనుక జగన్ డైరెక్షన్ ఉందన్నారు. అందుకే.. వైసీపీ సభ్యులు.. శ్రీవారి చిత్రపటాలను అవమానకర రీతిలో పట్టుకుని ఆందోళనకు దిగారని.. ఇది క్షమించరాని మహా పాపమని లోకేష్ వ్యాఖ్యానించారు.
హెరిటేజ్-ఇందాపూర్ డెయిరీ అంశంపై చర్చకు పట్టుబడుతూ.. వైసీపీ సభ్యులు మండలిలో తీర్మానం ఇచ్చారు. దీనిని చైర్మన్ మోషేన్ రాజు తిరస్కరించారు. ముందస్తు ప్రణాళికలో భాగంగానే శ్రీవారి చిత్రపటాలను తీసుకుని మండలిలోకి ప్రవేశించిన వైసీపీ సభ్యులు చైర్మన్ పోడియం వద్ద తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. నినాదాలతో హోరెత్తించారు. చిత్రపటాలను చేతిలో పట్టుకుని.. నిరసన తెలిపారు.
ఈ ఘటనపై సభలోనే ఉన్న కూటమి మంత్రులు, సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నారని వ్యాఖ్యానించారు. ఇక, ఈ వ్యవహారంపైనే మంత్రి లోకేష్ కూడా స్పందించారు. కలియుగ దైవం శ్రీవారి చిత్రపటాలను అవమానించారని, ఇది క్షమించరాని మహాపాపమని అన్నారు. ''జగన్కు దేవుడంటే భక్తి, భయం లేవు., హిందువుల మనోభావాలంటే అస్సలు లెక్కేలేదు.'' అని లోకేష్ మండిపడ్డారు.
తిరుమల శ్రీవారి చిత్రపటాలను బూట్లు, చెప్పులతోనే పట్టుకుని ప్రదర్శించారని, సభ ముగిశాక వాటిని అక్కడే వదిలేసి వెళ్లారని లోకేశ్ పేర్కొన్నారు. "శ్రీవారికి చేసిన మహా పాపం కప్పిపుచ్చుకోవడానికి మహాపరాధం చేశావు జగన్. మీ వైసీపీ ఎమ్మెల్సీలు బూట్లు, చెప్పులతో వెంకటేశ్వర స్వామి చిత్రపటాలు పట్టుకుని మహాపరాధం చేశారు. వెంకన్నతో పెట్టుకోవద్దు జగన్!" అంటూ లోకేశ్ మండిపడ్డారు. వైసీపీ సభ్యులు వ్యవహరించిన తీరుకు సంబంధించిన వీడియోలను తన సామాజిక మాధ్యమంలో పోస్టు చేశారు.


.jpeg)
