ఆంధ్రప్రదేశ్, AUG, 11: శాసనసభ సమావేశాలు ఈ నెల 17వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల్లోనే అత్యంత కీలకమైన బీసీ రిజర్వేషన్ల బిల్లును ప్రవేశపెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. గత ఎన్నికల్లో కూటమి ఇచ్చిన హామీ మేరకు స్థానిక సంస్థల ఎన్నికల్లో వెనుకబడిన తరగతులకు (బీసీలు) 34 శాతం రిజర్వేషన్లు పునరుద్ధరించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఇప్పటికే సమగ్ర కసరత్తు ప్రారంభించింది.
ఇందులో భాగంగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్రా నేతృత్వంలో ఒక ప్రత్యేక డెడికేటెడ్ కమిషన్ను ఏర్పాటు చేసింది. ఈ కమిషన్ రాష్ట్రంలోని బీసీల సామాజిక, ఆర్థిక, విద్య, రాజకీయ పరిస్థితులపై లోతుగా అధ్యయనం చేస్తోంది. రాబోయే అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యే లోపే తమ అధ్యయన నివేదికను ప్రభుత్వానికి సమర్పించేలా చర్యలు చేపట్టారు.
కమిషన్ నుంచి నివేదిక అందగానే దానిపై విశ్లేషించి, రాబోయే సమావేశాల్లోనే శాసనసభ ముందు చర్చకు ఉంచనున్నారు. సభలో సుదీర్ఘంగా చర్చించిన అనంతరం బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లును ఆమోదింపజేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడానికి ముందే ఈ చట్టపరమైన ప్రక్రియను పూర్తి చేసి, బీసీలకు రాజకీయంగా తగిన న్యాయం చేయాలని కూటమి ప్రభుత్వం యోచిస్తోంది.

