యోగాతో శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది: యోగా గురువు ప్రవీణ్ చెన్నెంరెడ్డి
ఏలూరు, జూన్ 13: యోగాంధ్ర-2026 కార్యక్రమంలో భాగంగా శనివారం ఏలూరు పోలీస్ పరేడ్ గ్రౌండ్స్లో పోలీసు సిబ్బందికి ప్రత్యేక యోగాభ్యాస కార్యక్రమాన్ని నిర్వహించారు. యోగా గురువు ప్రవీణ్ చెన్నెంరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పోలీసు శాఖ సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ప్రవీణ్ చెన్నెంరెడ్డి యోగాసనాలు చేసే సరైన విధానాన్ని వివరించడంతో పాటు, యోగా ద్వారా లభించే ఆరోగ్య ప్రయోజనాలను తెలియజేశారు. ప్రతిరోజూ ఉదయం కనీసం 30 నిమిషాల సమయాన్ని యోగాభ్యాసానికి కేటాయిస్తే శారీరక దృఢత్వం, మానసిక ప్రశాంతత లభిస్తాయని చెప్పారు.
నిత్య యోగాభ్యాసం ద్వారా ఒత్తిడి తగ్గడంతో పాటు శ్వాసకోశ, గుండె సంబంధిత సమస్యలను నియంత్రించుకోవచ్చని తెలిపారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు కూడా యోగాను జీవనశైలిలో భాగం చేసుకుంటే ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చని సూచించారు.
పోలీసు విధులు అత్యంత ఒత్తిడితో కూడుకున్నవని, అలాంటి పరిస్థితుల్లో యోగా మానసిక ఏకాగ్రతను పెంచి విధుల నిర్వహణలో మెరుగైన ఫలితాలను అందిస్తుందని పేర్కొన్నారు. ఆరోగ్యకరమైన జీవనశైలికి యోగా ఎంతో ఉపయోగకరమని వివరించారు.
ఏలూరు పోలీస్ పరేడ్ గ్రౌండ్స్లో ప్రతిరోజూ ఉదయం పోలీసు సిబ్బందికి యోగాభ్యాస కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని యోగా గురువు ప్రవీణ్ చెన్నెంరెడ్డి తెలిపారు. యోగాంధ్ర-2026 కార్యక్రమం ద్వారా సమాజంలోని అన్ని వర్గాల ప్రజల్లో యోగాపై అవగాహన పెంపొందించడం లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు.

