రైతుల అవసరాలకు తగిన విధంగా పంపిణీ చేయాలి
ఎరువుల పంపిణీలో ఎటువంటి సమస్యలు లేకుండా చర్యలు తీసుకోవాలి
జిల్లాలో ఎరువుల లభ్యత సరఫరాలపై వ్యవసాయ శాఖ అధికారులతో జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి టెలి కాన్ఫరెన్స్
ANDRAPRADESH, ఏలూరు: ఏలూరు జిల్లా నుండి ఎరువులు ఇతర ప్రాంతాలకు తరలిపోకుండా జిల్లా, అంతరాష్ట్ర సరిహద్దుల వద్ద చెక్ పోస్ట్ లు ఏర్పాటుచేసి పటిష్టమైన నిఘా పెట్టాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. జిల్లాలో ఎరువుల లభ్యత, సరఫరాలపై శనివారం కలెక్టరేట్ నుండి సంబంధిత శాఖల అధికారులతో టెలి కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ సమీక్షించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ జిల్లాలో రైతులకు అవసరమైన ఎరువులు నిల్వలు ఉన్నాయన్నారు. జిల్లాలోని సొసైటీలకు, డీలర్లకు రానున్న వారానికి అవసరమైన యూరియా, ఇతర ఎరువులను సరఫరా చేయడం జరిగిందని, వాటిని రైతుల అవసరాలకు తగిన విధంగా పంపిణీ చేయాలని, ఎరువుల పంపిణీలో ఎటువంటి సమస్యలు లేకుండా చర్యలు తీసుకోవాలని వ్యవసాయాధికారులకు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.
ఈ సందర్భంగా మండల పరిధిలో ప్రస్తుత ఎరువుల నిల్వలు, రానున్న వారానికి అవసరమైన ఎరువుల వివరాలను మండల వ్యవసాయాధికారి వారీగా కలెక్టర్ ఆరా తీశారు. జిల్లాలో రైతులకు అవసరమైన ఎరువులు నిల్వలు ఉన్నాయని, రైతులు ఈ విషయంలో ఎటువంటి భయాందోళనలు పడకుండా, ఎరువులను పెద్దమొత్తంలో నిల్వలు ఉంచుకోకుండా ఉండేలా వ్యవసాయాధికారులు రైతులకు అవగాహన కలిగించాలన్నారు. జిల్లాలోని అన్ని సొసైటీలలో కనీస ఎరువుల నిల్వలు ఉండేలా చూడాలన్నారు.
ఎరువుల సరఫరాలో జిల్లాలో ఎక్కడైనా ఒకే రైతుకు అధిక మోతాదులో పంపిణీ చేసిన సంఘటనలను గుర్తిస్తే వెంటనే వాటిపై పూర్తిస్థాయి విచారణ చేసి నివేదిక సమర్పించాలన్నారు. ప్రైవేట్ డీలర్ల వద్ద పెద్దమొత్తంలో యూరియా నిల్వలు లేకుండా ప్రత్యేక నిఘా పెట్టాలన్నారు. ఎరువుల సరఫరాలో ఎక్కడైనా లోపాలు జరిగినట్లు గుర్తిస్తే సంబంధిత సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు.
వ్యవసాయశాఖ జాయింట్ డైరెక్టర్ హబీబ్ భాషా,డి సి వో శ్రీనివాస్, మార్క్ ఫెడ్ అధికారులు, మండల వ్యవసాయాధికారులు, టెలీకాన్ఫెరెన్స్ లో పాల్గొన్నారు.