Ticker

6/recent/ticker-posts

ప్రకృతి వ్యవసాయంలో విత్తన గుళికల తయారీపై రైతులకు అవగాహన


ఏలూరు, జూన్ 12: ఏలూరు మండలం వెంకటాపురం గ్రామంలో శుక్రవారం రైతులతో కలిసి విత్తన గుళికల (సీడ్ పెలెటైజేషన్) తయారీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రకృతి వ్యవసాయ జిల్లా ప్రాజెక్టు మేనేజర్ బి. వెంకటేష్ ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో రైతులకు విత్తన గుళికల ప్రాముఖ్యత, ప్రయోజనాలపై అవగాహన కల్పించారు.


ఈ సందర్భంగా డివిజనల్ ఇన్‌చార్జి ఎన్ఎఫ్ఏ నవీన మాట్లాడుతూ, ప్రస్తుత ఎల్‌నినో ప్రభావంతో అధిక ఉష్ణోగ్రతలు, అనిశ్చిత వర్షపాతం పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. నవధాన్యాల సాగులో విత్తనాలు పాడవకుండా ఉండేందుకు విత్తన గుళికలను తయారు చేసి పొలాల్లో వెదజల్లడం ఉత్తమ పద్ధతి అని తెలిపారు.

విత్తన గుళికలు సుమారు ఆరు నెలల వరకు సురక్షితంగా నిల్వ ఉండటమే కాకుండా, అనుకూల వాతావరణ పరిస్థితులు ఏర్పడినప్పుడు మెరుగైన మొలకలను అందిస్తాయని వివరించారు. దీంతో విత్తన నష్టం తగ్గి, పంటల స్థిరత్వం పెరుగుతుందని పేర్కొన్నారు.

రైతులు 30 రకాల వరకు నవధాన్యాల విత్తనాలను పచ్చిరొట్ట ఎరువుగా సాగు చేయడం ద్వారా భూసారాన్ని పెంచుకోవచ్చని నవీన తెలిపారు. ఈ విధానం నేల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో పాటు ప్రకృతి వ్యవసాయాన్ని మరింత బలోపేతం చేస్తుందని రైతులకు వివరించారు.

ఈ కార్యక్రమంలో వీఆర్వో ప్రసాద్, సచివాలయ సిబ్బంది, ఎఫ్‌ఎమ్‌టీ వెంకటలక్ష్మి, ఐసీఆర్‌పీలు, రైతులు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.