Ticker

6/recent/ticker-posts

ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటుకు భూసేకరణ పనులను వేగవంతం చేయాలి


పోలవరం ప్రాజెక్ట్ ఆర్ అండ్ ఆర్ భూసేకరణను త్వరితగతిన పూర్తిచేయాలి

జిల్లాలో వివిధ ప్రోజెక్టుల భూసేకరణ పీసా కమిటీ ఆమోదం తీసుకోవాలి
పోలవరం ఆర్ అండ్ ఆర్, జాతీయ రహదారుల భూసేకరణలపై అధికారులు జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి వీడియో కాన్ఫరెన్స్

ఏలూరు, ఫిబ్రవరి, 2 :  జిల్లాలోని ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటుకు సంబంధించి భూసేకరణ పనులను వేగవంతం చేయాలని  జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్ నుండి సోమవారం సాయంత్రం పోలవరం ప్రాజెక్టు ఆర్ అండ్ ఆర్ పునరావాస కార్యక్రమాలు, జాతీయ రహదారుల నిర్మాణానికి, సెల్ ఫోన్ నెట్వర్క్ టవర్ల ఏర్పాటు, ఎంఎస్ ఎం ఈ పార్కుల ఏర్పాటు నిమిత్తం భూ సేకరణ పై అధికారులతో జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ సమీక్షించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ  జిల్లాలో పోలవరం నిర్వాసితులకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజి, కాలనీల నిర్మాణం, జాతీయ రహదారులు, ఎంఎస్ ఎం ఈ పార్కుల ఏర్పాటు, బిఎస్ఎంఎల్ టవర్ల ఏర్పాట్లకు సంబంధించి భూసేకరణను సంబంధిత గ్రామాలలో పీసా కమిటీ సమావేశాలు తప్పనిసరిగా నిర్వహించి ఆమోదం తీసుకోవాలని, ఆమోదం అనంతరం భూసేకరణ ప్రకటనలను విడుదల చేయాలన్నారు.  

జీలుగుమిల్లి-పట్టిసీమ రహదారిలో వివిధరకాల చెట్లు కోల్పోతున్న వారికి చెట్లకు పరిహారం పై నివేదికను మంగళవారం సాయంత్రం నాటికి  సమర్పించాలని ఉద్యానవన శాఖాధికారులను కలెక్టర్ ఆదేశించారు. జాతీయ రహదారులకు సంబంధించి ఎన్ .హెచ్. 165, గ్రీన్ ఫీల్డ్ హై వే, జీలుగుమిల్లి పట్టిసీమ, పెడన-లక్ష్మీపురం 216-హెచ్ రహదారి, పట్టిసీమ-గూటాల రహదారుల భూసేకరణ పై, అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి సంబంధించి ఏలూరు జిల్లాలో చేపట్టే భూసేకరణ  ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని, జిల్లాలో జాతీయ రహదారుల నిర్మాణానికి సంబందించి కోర్ట్ లలో ఉన్న కేసులు త్వరితగతిన పరిష్కారం అయ్యేలా చూడాలన్నారు. జిల్లాలోని ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటుకు సంబంధించి భూసేకరణ పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.

జిల్లా జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ, డిఆర్ఓ వి.విశ్వేశ్వర రావు, పోలవరం ప్రాజెక్ట్ అడ్మినిస్ట్రేటర్ అభిషేక్, నూజివీడు సబ్ కలెక్టర్ బొల్లిపల్లి వినూత్న, ఏలూరు, జంగారెడ్డిగూడెం ఆర్డీవో లు యం.అచ్యుత అంబరీష్, రమణ, కలెక్టరేట్ భూసేకరణ విభాగ  అధికారి పోతురాజు, జిల్లా భూసేకరణ అధికారులు, జాతీయ రహదారుల ప్రాజెక్ట్ డైరెక్టర్లు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లు, తదితరులు పాల్గొన్నారు.