ANDRAPRADESH: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గం వైఎస్సార్సీపీలో కొత్త తలనొప్పి మొదలైంది. సొంత పార్టీ నేతలు కుప్పం నియోజకవర్గ ఇంఛార్జ్, ఎమ్మెల్సీ భరత్ తీరుపై భగ్గుమన్నారు. ఎమ్మెల్సీ భరత్ నాయకత్వంపై వైఎస్సార్సీపీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. భరత్ను నమ్ముకుంటే పార్టీ తుడిచిపెట్టుకుపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. శాంతిపురం జడ్పీటీసీ సభ్యుడు శ్రీనివాసులు, మాజీ సర్పంచి మురళితో పాటు పలువురు నేతలు కూతేగానిపల్లెలో సమావేశమై.. పార్టీని విస్మరించి, భజనపరులకే పదవులు ఇస్తున్నారని, భరత్ టీడీపీ దాసోహం అయ్యారని ఆరోపించారు.
పార్టీని నమ్ముకున్న వారిని కాదని, కొందరికే పదవులు ఇస్తున్నారని విమర్శించారు వైఎస్సార్సీపీ నేతలు. రామకుప్పం ఎంపీపీ ఉప ఎన్నికలో వైఎస్సార్సీపీ సభ్యులు మెజారిటీగా ఉన్నా, టీడీపీ అనుకూలంగా వ్యవహరించారని ఆరోపించారు. కుప్పం మున్సిపల్ ఛైర్మన్ ఎన్నికలో భరత్ అసమర్థత బయటపడిందని.. అధికారం కోల్పోయిన వెంటనే కుప్పంలో అందుబాటులో లేని భరత్కు పార్టీ క్రమశిక్షణ గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. ఇదిలా ఉంటే.. పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడినందుకు ఈ నేతలపై వైఎస్సార్సీపీ అధిష్టానం సీరియస్గా స్పందించింది.. వారిపై చర్యలు తీసుకుంది.
ఈ మేరకు వైఎస్సార్సీపీ శాంతిపురం జడ్పీటీసీ సభ్యుడు శ్రీనివాసులు, మాజీ సర్పంచి మురళి, సర్పంచి జగదీష్ భార్య నీలాను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ఎమ్మెల్సీ భరత్ ప్రకటించారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందున చర్యలు తీసుకున్నాము అన్నారు. వైఎస్సార్సీపీలో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు జిల్లా ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి. కుప్పం నియోజకవర్గంలో వైఎస్సార్సీపీపై సొంత పార్టీ కార్యకర్తలే విమర్శలు చేయడం ఆసక్తికరంగా మారింది. పార్టీ నుంచి సస్పెండ్ చేయడంపై నేతలు స్పందించాల్సి ఉంది. మొత్తం మీద కుప్పం వైఎస్సార్సీపీకి సొంత పార్టీలోనే కొత్త తలనొప్పి మొదలైంది.
కుప్పం నియోజకవర్గం మొదటి నుంచి టీడీపీకి కంచుకోటగా ఉంది.. 1989 నుంచి చంద్రబాబు నాయుడు కుప్పం నుంచి వరుసగా ఎమ్మెల్యేగా విజయం సాధిస్తున్నారు. గత ఎన్నికల్లో కుప్పంలో పాగా వేయాలని వైఎస్సార్సీపీ గత ఐదేళ్ల నుంచి ప్లాన్ చేసింది.. వైనాట్ 175తో పాటుగా వైనాట్ కుప్పం అంటూ ఆ పార్టీ నేతలు ప్రచారం చేశారు. అక్కడ ఇంఛార్జ్గా ఉన్న భరత్కు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. అలాగే చిత్తూరు జిల్లా సీనియర్ నాయకుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి కుప్పం బాధ్యతలు అప్పగించారు. కానీ వైఎస్సార్సీపీ వ్యూహాలు ఫలించలేదు.. చంద్రబాబు నాయుడు మరోసారి అక్కడి నుంచి విజయం సాధించారు.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యారు. ఏపీ సీఎం చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం కావడంతో కుప్పం వైఎస్సార్సీపీలో జరుగుతున్న పరిణామాలు రాష్ట్రంలో చర్చనీయాంశమైంది.
Social Plugin