ఆంధ్రప్రదేశ్లో 22ఏ జాబితాలో చేర్చిన ప్రైవేటు పట్టా భూముల వ్యవహారం తలనొప్పిగా మారింది.. చాలామంది రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భూములను అమ్మడం లేదా కొనడం వంటివి చేయలేరు.. అందుకే ఈ భూముల సమస్యలను త్వరగా పరిష్కరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో ఏలూరు జిల్లాలో 22ఏ జాబితా భూముల సమస్యలకు పరిష్కారం దిశగా కీలక ముందడుగు పడింది. జిల్లా కలెక్టరేట్కు అన్ని మండలాల రెవెన్యూ అధికారులు, బాధితులను పిలిపించి, అక్కడికక్కడే సమస్యలను పరిష్కరించారు.
ఏలూరు జిల్లా ఇంఛార్జ్ మంత్రి నాదెండ్ల మనోహర్, ఎమ్మెల్యేలు స్వయంగా రంగంలోకి దిగారు.. బాధితులతో మాట్లాడారు. చాలామంది సమస్యలు పరిష్కారం కావడంతో ఆనందంలో ఉన్నారు. తాము ఎన్నో ఏళ్లుగా అధికారులు చుట్టూ తిరుగుతున్నామని.. అయినా ఈ భూముల సమస్యలు పరిష్కారం కాలేదన్నారు. ఇప్పుడు మంత్రి, ఎమ్మెల్యేల సమక్షంలో ఒక్క రోజులోనే సమస్య పరిష్కారం కావడంతో వారంతా సంతోషం వ్యక్తం చేశారు.
ఇకపై 22ఏ జాబితాలో భూ సమస్యలపై ప్రతినెలా గ్రీవెన్స్ నిర్వహిస్తామని మంత్రి మనోహర్ తెలిపారు. నిషేధిత జాబితా నుంచి సర్వే నంబర్లు తొలగించారా లేదా అనేది ఇకపై వెబ్సైట్లో చూసుకోవచ్చన్నారు. ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి, జేసీ అభిషేక్ గౌడ సహా అధికారులు 809 వినతులను స్వీకరించారు. అధికారులు బాధితుల సమస్యల్ని విని పరిష్కారం చేశారు. ఏళ్ల తరబడి వెంటాడుతున్న సమస్యలు ఒక్క రోజులోనే పరిష్కారం కావడంతో బాధితులు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ మేరకు ప్రభుత్వ అధికారులు కలెక్టరేట్లో రికార్డుల్ని పరిశీలించి పరిష్కారం చూపించారు.. దీని కోసం దాదాపు నెల రోజులుగా కసరత్తు చేశారు. మిగిలిన జిల్లాల్లో కూడా ఏలూరు తరహాలో భూసమస్యల పరిష్కారానికి చేసినట్లుగా.. అక్కడ కూడా అనుసరించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదేశించారు. రెండు వారాల్లో రెవెన్యూ, దేవదాయ, రిజిస్ర్టేషన్ శాఖల ఆధ్వర్యంలో సమస్యలకు పరిష్కార మార్గాలను చూపించాలన్నారు. ఈ భూములకు సంబంధించిన సమస్యలు తొలగిపోయిన వారు దర్జాగా ఆ భూముల్ని అమ్ముకోవచ్చు, ఎవరైనా కొనుగోలు చేయొచ్చు అంటున్నారు. ఎంతో సుదీర్ఘకాలం తర్వాత ఈ భూముల సమస్యలు పరిష్కారం అయ్యాయి.


.jpeg)
